ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
రాయిసెంటర్ల ప్రతినిధులతో సమావేశం
ఆసిఫాబాద్, ఏప్రిల్ 29 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్మూలనకు గిరి గ్రామాల్లో వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి రాయి సెంటర్ల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి కూడా టీకా వేయనున్నట్లు, ఇందుకోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. కొవిడ్పై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను సబ్బు లేదా శానిటైజర్తో తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలన్నారు. జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ కోసం అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, జిల్లా రాయి సెంటర్ సర్మేడి కోవా దేవ్రావు, జిల్లాలోని అన్ని రాయిసెంటర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.