పసివాడు కోలుకోవాలని..
ఎమ్మెల్సీ కవిత శ్రద్ధతో చిన్నారికి మెరుగైన వైద్యం
చికిత్సకు దాతల చేయూత
భీంపూర్, ఏప్రిల్ 26: భీంపూర్ మండల పరిషత్లో ఆపరేటర్గా పనిచేస్తున్న తాంసికి చెందిన ఇప్ప సంతోష్, పూర్ణిమ దంపతుల కుమారుడు శ్రీయాష్ (9నెలలు) కొవిడ్తో హైదరాబాద్ కిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతుండగా దాతలు సహా ఎమ్మెల్సీ కవిత స్పందించిన విషయం తెలిసిందే. ట్వీట్ విజ్ఞాపనకు స్పందించిన కవిత కిమ్స్ వైద్యులతో మాట్లాడారని, స్వయానా తమకు ఫోన్ చేసి ధైర్యం ఇచ్చారని, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా చేయూతనిస్తామని తెలిపారని బాలుడి తండ్రి సంతోష్ సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. ప్రస్తుతం వైద్యులు తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తలిదండ్రులు తెలిపారు. మండల వాట్సాప్ గ్రూపుల విజ్ఞాపనల మేరకు పసివాడి ప్రాణం కోసం స్పందన వచ్చింది. రెండు రోజుల క్రితమే సింగపూర్లో ఉన్న ఒక ఎన్నారై రూ. లక్ష, అప్పటి జిల్లా కలెక్టర్, ఇప్పటి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ రూ.50 వేల చెక్కు అందజేశారు. కిమ్స్లో ఖరీదైన వైద్యానికి రోజుకు రూ.లక్ష వరకు అవుతున్నాయి. దాతలు రూ.200 నుంచి రూ.5వేలు, రూ. 10 వేల వరకు అందిస్తున్నారు. భీంపూర్ మండల అధికారులు, సిబ్బంది, సర్పంచ్లు , యువకులు, సహా మహారాష్ట్ర నుంచి కూడా ఆర్థిక సాయం అందింది. ఒక ఎస్ఐ రూ.10 వేలు, తాంసికి చెందిన నవీన్ రూ.5 వేలు, నిపాని సర్పంచ్ భూమన్న రూ.4 వేలు, ఎంపీడీవో శ్రీనివాస్ రూ.5 వేలు అందించారు.