యాదాద్రి, మే 4 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవాన్ని అర్చకులు బుధవారం ఘనంగా జరిపించారు. స్వయంభూ ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణం చేపట్టారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనం పురవీధుల్లో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపించారు. తొలుత స్వామికి సుదర్శన నారసింహ హోమం చేశారు. స్వామి వారి నిత్యపూజలు వేకువజామున 3.30గంటలకు ప్రారంభమయ్యాయి. స్వయంభువులను ఆరాధించి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు చేశారు. అనంతరం లక్ష్మీనర్సింహులను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. శ్రీ పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర ఆలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ.17,02,134 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.
ప్రధానాలయంలో శ్రీరామానూజ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండో రోజులో భాగంగా ఉదయం అభిషేకం సమయంలో నవకలశ తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం రామానూజ ఆళ్వారులకు పురప్పాట్ సేవ చేశారు. అనంతరం స్వామివారిని ముఖ మండపంలో వేంచేపు చేసి ఆరాధన చేపట్టారు. రాత్రి నివేదనతో ఉత్సవాలకు ముగింపు పలికారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,13,800
వీఐపీ దర్శనం 60,000
వేద ఆశీర్వచనం 3,600
నిత్యకైంకర్యాలు 1,400
సుప్రభాతం 3,300
క్యారీబ్యాగుల విక్రయం 6,200
వ్రత పూజలు 90,400
కల్యాణకట్ట టిక్కెట్లు 25,200
ప్రసాద విక్రయం 8,33,500
వాహనపూజలు 8,900
అన్నదాన విరాళం 34,735
శాశ్వత పూజలు 65,000
సువర్ణ పుష్పార్చన 1,41,400
యాదరుషి నిలయం 64,000
పాతగుట్ట నుంచి 33,710
లక్ష్మీపుష్కరిణి 600
లీసెస్, లీగల్ 1,15,524