ఉమ్మడి రాష్ట్రంలో తెగిన కట్టలు, మరమ్మతులకు నోచుకోని చెరవులు, చెక్డ్యాంలు దర్శనమిచ్చేవి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో నేడు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు పూర్వవైభవాన్ని పొందుతున్నాయి. రైతన్నలు చెరువుల్లో వాననీటిని చూసి సంబురపడుతున్నారు. మిషన్ కాకతీయ పథకంతో భూగర్భ జలాలు ఘననీయంగా పెరిగి బోరు, బాయిల్లో పుష్కలంగా నీరు ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వానకాలం, యాసంగి సాగుకు డోకా లేదని రైతులు దీమా వ్యక్తం చేస్తున్నారు.
-షాద్నగర్, ఆగస్టు 17
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చెవేళ్ల నియోజకవర్గాల్లో సుమారుగా 193 చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా అభివృద్ధి చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని 175 చెరువులకు రూ.58.2 కోట్లను కేటాయించి మరమ్మతు పనులు చేపట్టారు. చేవెళ్ల డివిజన్ పరిధిలో 30కి పైగా చెరువులు అభివృద్ధిలోకి వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. చేవెళ్ల డివిజన్లోని మిర్జగూడ, గుండాల, కౌకుంట్ల, తాలరాం, ఇర్లపల్లి, బతుకమ్మకుంట, సొరంగల్, నక్కలపల్లి, పెద్ద మంగళారం, బాకారం, పోచమ్మకుంట, ఫైల్వాన్ చెరువు, షాబాద్ చెరువులు అలుగు దుంకాయి. పలు గ్రామాల్లోని వాగులపై నిర్మించిన చెక్డ్యాంల్లో వర్ష నీరు భారీగా నిలిచింది. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో సుమారు 50 చెరువులకు పైగా అలుగు దంకాయి.
షాద్నగర్ నియోజకవర్గం 90 వేల 332 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పంటలను సాగుచేశారు. 111 రెవెన్యూ గ్రామాలతో పాటు 95 పంచాయతీలు, ఆరు మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ 55,618 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. 46,825 హెక్టార్లలో వర్షాధార పంటలతో పాటు బోరుబావుల ద్వారా పంటలు సాగుచేస్తున్నారు. భూగర్భ జలాల పెంచడంతో పాటు ఉపాధి చూపాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది. చెరువులను అభివృద్ధి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. షాద్నగర్ పరిధిలో 534 చెరువులు, కుంటలున్నాయి. వీటి ద్వారా సుమారు 15 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందనున్నది.
చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 32.06 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 22.93 కోట్లు ఖర్చు చేసి 141 చెరువులు అభివృద్ధి చేశారు. మొదటి, రెండో విడతలో కేశంపేట మండలంలో 48 చెరువులు, కొందుర్గు, చౌదరిగూడెం మండలాల్లో 34, కొత్తూరు, నందిగామ మండలాల్లో 21, ఫరూఖ్నగర్ మండలంలో 38 చెరువుల్లో పూడిక తీసి, కట్ట మరమ్మతులు చేశారు. మూడో విడతలో షాద్నగర్ డివిజన్లోని ఆరు మండలాల్లో 53 చెరువులను రూ.7.8 కోట్లతో అభివృద్ధి చేశారు.
ఇటీవల కురిసిన వానలకు షాద్నగర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కేశంపేట మండలంలో అమ్మచెరువు, బ్రహ్మ చెరువు, మేడికుంట, రాయికుంట, గాజుల కుంట, చౌలపల్లి చెరువు, కొత్తపేట చెరువు, తొమ్మిది రేకుల చెక్డ్యాం, కొత్తమర్రి కుంట, కల్వల కుంట, కొత్త కుంట, పోచమ్మ చెరువు, దొంతిబాయి కుంట, ఊట చెరువు, బండ్ల కుంట, పెద్ద చెరువు, మోడి కుంట, కొత్త చెరువు, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని చెరువులు, కుంటలు, కొత్తూరు, నందిగామ మండలాల్లోని నర్సప్పగూడ, కుమ్మరికుంట చెరువులు, అక్కమ్మ చెరువు, కొత్తూరు, పెంజర్ల, మేకగూడ, నందిగామ చెరువులు, ఫరూఖ్నగర్ మండలం ఎలికట్ట చెరువు, మొగిలిగిద్ద చెరువు, బొబ్బిలి చెరవు, రాయికల్, చిల్కమర్రి, బూర్గుల, కమ్మదనం, చించోడు, లింగారెడ్డిగుడా చెరువులతో పాటు అన్ని కుంటలు, చెక్డ్యాంల్లో జలకళ సంతరించుకుంది. చెరువులు, కుంటల్లోకి నీళ్లు రావడంతో భూగర్భ జలాలు ఘణనీయంగా పెరిగాయి. వాన కాలంలో లక్ష్యాన్ని మించి పంటలు సాగుచేస్తుండగా యాసంగిలో సాగుచేసే వేరుశనగ, వరి, మిర్చి, కూరగాయల పంటలతో పాటు ఉద్యానవన పంటల సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు భావిస్తున్నారు.
వానలకు మా ఊర్లో చెరువులకు నీళ్లు వచ్చాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువు కట్టను అభివృద్ధి చేసిండ్రు. వచ్చిన నీళ్లన్నీ నిలిచాయి. దీంతో చెరువు చుట్టుపక్క పొలాల్లోని బోరుబావుల్లో నీళ్లు పెరిగాయి. వాన కాలంతో పాటు యాసంగి సాగుకు రైతులకు సరిపోను నీళ్లున్నాయి.
-శానమోని శ్రీశైలం, రైతు, చౌలపల్లి, కేంశంపేట మండలం
గతేడాది నుంచి కరువు మాట వినిపిస్తలేదు. మా ఊర్లో ఉన్న రెండు చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి. ప్రభుత్వం చెరువులకు మరమ్మతు పనులు చేయడంతో నీళ్లు బాగా నిలిచాయి. బోరుబావుల్లో నీళ్లు పెరుగాయి. 24 గంటల కరెంట్తో వానం కాలం పంటలు బాగా పండుతాయి. సరిపోను నీళ్లు ఉండడంతో యాసంగి పంటలు సాగు చేసుకునేందుకు డోకాలేదు.
-శేఖర్యాదవ్, యువరైతు, చింతగూడ, ఫరూఖ్నగర్ మండలం