రోడ్షోలు, సమావేశాలతో ఓటర్లకు చేరువైన టీఆర్ఎస్
అభివృద్ధి, సంక్షేమమే గులాబీ శ్రేణుల అస్త్రం
ఇంటింటికెళ్లి.. పథకాలు వివరించిన నేతలు
మంత్రి పువ్వాడ సారథ్యంలో జోరుగా ప్రచారం
పాల్గొన్న ఎమ్మెల్యేలు, నేతలు
ఖమ్మం, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మండుటెండలోనూ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు చెమటోడ్చారు. రోజూ నేతల రోడ్షోలు, సమావేశాలు, మైక్ల మోతలతో నగరం హోరెత్తింది. ప్రముఖుల రాకతో డివిజన్లలో సందడి వాతావరణం నెలకొంది. నగరంలో దాదాపు 12రోజుల పాటు నిర్వహించిన ప్రచారం మంగళవారం సాయంత్రం పరిసమాప్తమైంది. షెడ్యూల్ ప్రకారం 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉన్నా.. కొవిడ్ ఉధృతి కారణంగా ఎన్నికల కమిషన్ సమయాన్ని కుదించింది. దీంతో పోలింగ్కు రెండురోజుల ముందు ప్రచారానికి తెరపడింది. టీఆర్ఎస్ శ్రేణులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఇంటింటి కెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించారు. గులాబీశ్రేణులు వివిధ డివిజన్లలో నిర్వహించిన రోడ్షోలు, సమావేశాలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరాగా.. ప్రతిపక్ష పార్టీల ప్రచారానికి స్పందన కరువైంది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సారథ్యంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు నేరుగా ఓటర్లను కలిసి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిని వివరించారు.
ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇన్ని రోజులుగా హోరెత్తిన మైక్లు మూగబోయాయి. నేతల హడావుడి, కార్యకర్తల సందడి తగ్గింది. మంగళవారం సాయంత్రం ప్రచారం బంద్ కావడంతో అంతా సైలెంట్ అయిపోయింది. ఈ నెల 15న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో టీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమమే ఆయుధంగా కదన రంగంలోకి దిగింది. రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలకంటే ముందే ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపిక, డివిజన్లలో ప్రచారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, డివిజన్లవారీగా అభివృద్ధిని ఓటర్ల కళ్లకు కట్టినట్లు వివరించడంతో టీఆర్ఎస్ అగ్రగామిగా నిలిచింది. ప్రతి ప్రచార సభలోనూ నగర అభివృద్ధిపై టీఆర్ఎస్ కృషి, పువ్వాడ అజయ్కుమార్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నగర రూపురేఖలు మారిన తీరును ఆ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచినా.. ప్రచారంలో పూర్తిగా వెనకబడిపోయారన్న అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమైంది.
టీఆర్ఎస్ జోరు..
నగరపాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్దే పైచేయిగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన 10వ డివిజన్ అభ్యర్థిని ధనలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకుని టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ, మరో స్వతంత్ర అభ్యర్థి అదే డివిజన్ నుంచి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ డివిజన్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న చావా మాధురి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి డివిజన్పై ప్రత్యేక దృష్టిసారించారు. పకడ్బందీగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీల నుంచి ఆయా డివిజన్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరడంతో గులాబీశ్రేణుల్లో మరింత జోష్ నింపింది. ఆయా డివిజన్లలో ముఖ్యనేతలు టీఆర్ఎస్లోకి చేరడంతో ప్రతిపక్ష పార్టీలు డీలా పడ్డాయి. ఫలితంగా ప్రచారం సైతం అనేక డివిజన్లలో పేలవంగా సాగింది. కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో పలువురు స్థానికేతరులు కావడం, వారికి ఓటర్లతో పరిచయాలు లేకపోవడం వంటి కారణాలతో ఆయా డివిజన్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇచ్చే పరిస్థితే లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 18వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పద్మ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలకడంతో ఆ డివిజన్లో టీఆర్ఎస్కు తిరుగులేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు 12రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి రాజకీయ పార్టీలకు అవకాశం ఉన్నా.. కొవిడ్ ఉధృతి దృష్ట్యా ఎన్నికల కమిషన్ ప్రచార సమయాన్ని కుదించింది. ఫలితంగా పోలింగ్కు రెండురోజుల ముందు ప్రచారాన్ని పరిసమాప్తం చేశారు.
సమన్వయంతో ముందుకు..
ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాయి. మంత్రి పువ్వాడ అజయ్కుమార్తోపాటు ఆయన సతీమణి వసంతలక్ష్మి, కుమారుడు నయన్రాజ్ డివిజన్లవారీగా తిరిగారు. నగర అభివృద్ధి కోసం మంత్రి పడుతున్న తపనను వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర హోంశాఖామంత్రి మహమూద్ అలీ, ఎంపీ నామా నాగేశ్వరరావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వవిప్ రేగా కాంతారావు,ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, కందాళ ఉపేందర్రెడ్డి, హరిప్రియానాయక్, మాగంటి గోపీనాథ్, నల్లమోతు భాస్కరరావు, బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ మంత్రి వేణుగోపాలచారి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్లు లింగాల కమల్రాజ్, కోరం కనకయ్య, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు బుడాన్బేగ్, నాయకులు ఆర్జేసీ కృష్ణ, దిండిగాల రాజేందర్, కమర్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు డివిజన్ల వారీగా ఎన్నికల బాధ్యతలు తీసుకుని అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.
ప్రతిపక్షాల ప్రచారానికి స్పందన కరువు
కాంగ్రెస్, బీజేపీల ప్రచారం పేలవంగా సాగింది. అభ్యర్థుల పక్షాన ప్రచారం చేయడానికి జిల్లాస్థాయి నాయకులే రాలేదన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మినహా ఎన్నికల ప్రచారంలో జిల్లా, రాష్ట్ర నేతలెవరూ పాల్గొనలేదని ఆ పార్టీ నేతలు, అభ్యర్థుల్లో అసంతృప్తి ఉంది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చినా ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి నగరంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నా.. ప్రజల నుంచి స్పందన కరువైంది. సంజయ్ రోడ్షోకు జనం లేక వెలవెలబోయింది.