బీసీ కులాలను, మహిళా నేతను, పార్టీ పెద్దలను కించపరిచేలా శివ చరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు రెండు రోజుల క్రితం బీసీ సంఘాలు స్పందించాయి.
ఈశ్వరమ్మ యాదవ్ ఫ్లెక్సీలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫొటో లేకుండా ఎలా వేశారని సురేష్ యాదవ్ను శివ చరణ్ రెడ్డి బూతులు తిట్టడంతో ఈశ్వరమ్మ యాదవ్ అనుచరులు ఎల్బీనగర్, మన్సూరాబాద్లోని శివ చరణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే శివ చరణ్ రెడ్డికి ఇండియన్ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.