ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
వైద్యాధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్
ఎదులాపురం, ఏప్రిల్ 20 : కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా పరీక్షలు, వ్యాక్సినేషన్ వంద శాతం జరిగేలా తహసీల్దార్లు, ఎంపీడీవోలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కుమ్రం భీం ఆసిపాబాద్ నుంచి మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ప్యూ విధించడానికి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున రాకపోకలు సాగుతున్నాయన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించనందునే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. వంద శాతం మాస్క్లు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. మాస్క్లు ధరించని వారి నుంచి ఫైన్ వసూలు చేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పాజిటివ్ కేసులు తగ్గించేందుకు మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి వందశాతం జరగాలని స్పష్టం చేశారు. ఇందుకు మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవోలు, ఆ మండలానికి చెందిన గ్రామ పంచాయతీలను చెరి సగం కేటాయించుకొని కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ , మాస్క్లు ధరిచండం, నిబంధనలు పాటించడం వంటివి నిర్వహించాలన్నారు.
పాజిటివ్ కేసులు పెరగడానికి జిల్లాలో 60 నుంచి 70 శాతం మంది మాస్క్ ధరించకపోవడమేనని స్పష్టమవుతున్నదని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా, సామజిక దూరం పాటించేలా అన్ని వర్గాల ప్రజలు, ప్రతినిధుల సమావేశాలు ఏర్పాటు చేసి తెలియజేశామన్నారు. మాస్క్లు ధరించని వారి నుంచి ఫైన్ వసూలు చేస్తున్నామని తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్కు వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ వీసీలో ఆర్డీవో జాడి రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.