దవాఖాన ఆవరణం ఆహ్లాదభరితం
ఐదేండ్లలో ఏపుగా పెరిగిన మొక్కలు
చిట్యాల్ దవాఖానలో 600 పైచిలుకు టేకు మొక్కలు
పీహెచ్సీకి కాయకల్ప అవార్డు
పరిగి, ఏప్రిల్ 25 : మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టి ఊరూరా పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించడంతో పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్గా మారింది పరిగి మండలంలోని చిట్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఐదేండ్ల కాలంలోనే మొక్కలు ఏపుగా పెరిగి పచ్చటి నీడను ఇవ్వడంతోపాటు ఆవరణంతా పచ్చదనం పరుచుకున్నట్లుగా తయారైంది. జిల్లా స్థాయిలోనూ చిట్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవార్డు అందుకున్నది.
600 పైచిలుకు మొక్కలు..
చిట్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామానికి దూరంగా ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు. సుమారు ఒక ఎకరా 2 గుంటల స్థలంలో ఈ దవాఖాన ఉన్నది. 2015-16 సంవత్సరంలో హరితహారం కార్యక్రమం కింద ఈ దవాఖాన ప్రాంగణంలో సుమారు 600 మొక్కలు నాటారు. ఇందులో టేకు మొక్కలు 95శాతం పైగానే ఉంటాయి. దవాఖాన భవనం, డాక్టర్ క్వార్టర్ భవనాలు, ఆవరణలో రోడ్డు మినహా మిగతా స్థలంలో పూర్తిస్థాయిలో మొక్కలు నాటారు. టేకు మొక్కలతోపాటు వేప, జామ, బత్తాయి, దానిమ్మ, నిమ్మ, సీతాఫల మొక్కలు సైతం ఉన్నాయి. దవాఖాన ఆవరణలో సిబ్బంది ప్రత్యేకంగా కొంత స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు సైతం సాగు చేపట్టారు.
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ
మొక్కలు నాటడం వరకే కాకుండా వాటి పెంపకంపై దవాఖాన డాక్టర్లతోపాటు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా మొక్కలకు నీరు పట్టడం, నైట్ వాచ్మెన్ను నియమించడం లాంటివి చేశారు. దవాఖాన అభివృద్ధి నిధుల నుంచి నెలకు ఆయనకు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. తద్వారా ప్రతిరోజూ ఉదయం ఈ మొక్కలకు నీరు పడుతూ వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు.
చల్లటి గాలితో చక్కటి వాతావరణం
అసలే ఎత్తైన ప్రదేశం, ఆవరణంతా మొక్కల మయంగా ఉండడంతో ఓవైపు చక్కటి నీడ, మరోవైపు చల్లటిగాలితో సర్కారు దవాఖాన ఆవరణ పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంది. దవాఖానకు రోజు 100 మందికిపైగా ఔట్ పేషెంట్లు వచ్చేవారు. దవాఖానలో వైద్యం చేయించుకున్న వారు బయట కూర్చోవడానికి వీలుగా చెట్ల కింద ప్రత్యేకంగా బెంచీలు ఏర్పాటు చేయించారు. అలాగే చెత్తను పారవేయడానికి డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు. ఆవరణలో కురిసే వర్షపునీరు వృథాగా పోకుండా ఇంకుడుగుంత నిర్మాణం సైతం చేపట్టారు.
2017-18లో కాయకల్ప అవార్డు
పరిగి మండలంలోని చిట్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2017-18 సంవత్సరానికి కాయకల్ప అవార్డు అందింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారుల బృందం దవాఖానను సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, శిశువులకు వ్యాక్సినేషన్, రికార్డుల పరిశీలన చేశారు. అలాగే దవాఖాన ఆవరణలో పచ్చదనం పెంపు ఇతర అనేక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అవార్డు అందజేశారు. తద్వారా ప్రజలకు అందజేస్తున్న వైద్యసేవలకు గుర్తింపు లభించింది.