కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
మొత్తం 260 బిగింపు
ప్రజల భద్రతకు భరోసా
కాగజ్నగర్టౌన్ , ఏప్రిల్ 28 : కాగజ్నగర్ను నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తున్నది. గృహ, వ్యాపార సముదాయాల వారికి అవగాహన కల్పిస్తూనే పోలీస్, మున్సిపల్శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారులు, చౌరస్తాలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, రైల్వే ఓవర్బ్రిడ్జి, చెక్పోస్టు, గాంధీనగర్, అంబేద్కర్, రాజీవ్గాంధీ, తెలంగాణ తల్లి చౌరస్తాల్లో 84 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, ప్రజలు, వ్యాపారులు మరో 176తో కలిపి మొత్తం 260 సీసీ కెమెరాలు ఉన్నాయి.
ఒక్కో సీసీ కెమెరా..
ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, పో లీసులు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. నేరం జరిగిన ప్రాంతంలో సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు వెంటనే మ్యాపింగ్ వేసుకుని నిందితులను పట్టుకుంటున్నారు. ఇటీవల బస్టాండ్లో ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కుతున్న సమయంలో కొందరు వ్యక్తులు అతని జేబులో నుంచి రూ. 50 వేలు దొంగిలించగా సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే దొంగలను పట్టుకున్నారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ..
సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జరిగిన సంఘటన దృశ్యాలను సేకరించి నేరస్తులను పట్టుకోవడంలో కీలకంగా మారుతు న్నాయి. ప్రజలు, వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలి.
-మోహన్, ఎస్హెచ్వో, కాగజ్నగర్