సిద్దిపేట, ఫిబ్రవరి 1, నమస్తే తెలంగాణ ప్రతినిధి: బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, వ్యవసాయం, సంక్షేమం, వైద్యం, పరిశ్రమలు, ఇలా ఏ రంగానికి కూడా నిధులు కేటాయించలేదని మండిపడుతున్నారు. 2022-23 బడ్జెట్ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోకసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. ఆదాయ పన్ను రాయితీలు ఇస్తారని ఆశించిన ఉద్యోగులను కేంద్రం మరోసారి మోసం చేసింది. ఏడేండ్లుగా ప్రతి బడ్జెట్లోనూ వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. రైతులకు మేలు చేస్తున్నామని చెప్పే బీజేపీ ఈ బడ్జెట్లో రైతుల కోసం ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించలేదు. బీజేపీ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో ఇవాళ్లి బడ్జెట్యే నిదర్శనమని చెప్పాలి. ఎరువుల మీద సబ్సిడీని తగ్గించడంతో రైతులపై మరింత భారం పడింది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు , రా రైస్ విషయాలపై ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి అండగా ఉన్న ఉపాధి హామీ పథకంలో భారీగా నిధుల కోత పెట్టింది. దీంతో సామాన్య, పేద కూలీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కరోనా మహమ్మారి విజృంభించడంతో రెండు, మూడేండ్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంతూళ్లకు వచ్చి ఉంటున్నారు. ఇలాంటి వారికి ఉపాధి హామీ పథకం అండగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిధుల కోత పెట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేంద్రం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టకుండా ఆ వర్గాలను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. చేనేత రంగానికి మొండి చేయి చూపింది. ఇక, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించాల్సింది పోయి.. ఒక్క పైసా ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సాగునీటి ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం జాతీయ హోదా కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ రంగాల్లో ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంపై మాట్లాడకపోవడంతో నిరుద్యోగులు బీజేపీపై మండి పడుతున్నారు. బడ్జెట్లో రైల్వేకు ఏమైనా నిధుల ఇస్తారా అని ఉమ్మడి మెదక్జిల్లా వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా అక్కన్నపేట, మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణాలు జరుగుతుండగా, ఇప్పటికే మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఉమ్మడి జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేదు.
తెలంగాణపై వివక్ష..
వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను బడ్జెట్లో కేంద్రం పూర్తిగా విస్మరించింది. దేశంలో ఇప్పటికే 30 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, రాబోయే రోజుల్లో మరో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనడం కేంద్రం అసమర్థతకు నిదర్శనం. అందరూ ఊహించినట్టే రాష్ర్టానికి మొండి చేయి చూపారు. దేశాభివృద్ధిలో కీలక నాలుగు రాష్ర్టాల్లో ఒక్కటైన తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. విభజన హామీలు నెరవేర్చక పోగా రావాల్సిన బకాయిలపై క్లారిటీ ఇవ్వక పోవడం వివక్షకు నిదర్శనం.దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు ద్వారా రూ. పది లక్షలు ఇస్తుంటే, కేంద్రం కూడా మరో పది లక్షలు ఇచ్చి వారికి ఆర్థికచేయూత నివ్వాలని అడిగినప్పటికీ కేంద్రం పట్టించు కోలేదు.బుందేల్ ఖండ్కు ప్రత్యేక హోదా ప్రకటించి నిధులు కేటాయించిన కేంద్రం రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులను గుర్తించక పోవడం సహించరాని విషయం.బీసీలు, గిరిజనులు, మైనార్టీ ప్రజలను అస్సలు పట్టించుకోలేదు.ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించే సమయంలో చెప్పినట్లు ఇది ఇరవై ఐదు సంవత్సరాల బ్లూ ప్రింట్ కాదు, చంద్రబాబు విజన్ 2020లాగే మిగిలి పోవడం ఖాయం.
మహిళాభివృద్దికి బడ్జెట్లో చోటేలేదు…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. మహిళలపై మోదీ సర్కార్ వివక్ష చూపిస్తున్నదనడానికి ఇది నిదర్శనం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలని మరిచిపోయినట్లుంది. బడ్జెట్లో మహిళలకు కేటాయిస్తున్న ప్రత్యేక నిధుల వివరాలు వివరించకపోవడం శోచనీయం. కేవలం అంకెలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రూపొందించిన బడ్జెట్ ఇది. వ్యవసాయ రంగ అభివృద్ధిపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఎక్కడా ప్రస్తావించకపోవడం అన్నదాతలపై ఉన్న కపట ప్రేమను బయటపెట్టింది.
అనాలోచిత బడ్జెట్..
కేంద్ర బడ్జెట్ దశదిశా లేకుండా అనాలోచితంగా ఉంది. పసలేని, పనికిమాలిన బడ్జెట్ల ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తికులాల వారికి, ఉద్యోగులకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆర్థిక మంత్రి ప్రసంగమంతా మాటల గారడీలా కొనసాగింది. రైతాంగానికి ప్రాధాన్యమివ్వకపోవడం హేయనీయం. ఆదాయ పన్ను స్లాబ్ను మార్చకపోవడం విచారకరం. వైధ్యం, ప్రజారోగ్యాన్ని బడ్జెట్లో గాలికి వదిలేయం జరిగింది. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణం. బడ్జెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశ ప్రజానికానికి కేంద్ర ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను తీసినట్టుగా ఉంది.
కార్పొరేట్లకు కేంద్రం తొత్తు..
ఆదాయపన్ను రాయితీ కల్పిస్తారని ఆశించించిన ఉద్యోగులకు కేంద్ర బడ్జెట్ మరోసారి నిరాశపరిచింది. కోట్లల్లో లాభాలు గడిచే కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతం తగ్గించి వారికి కేంద్రం తొత్తుగా మారింది. సాధారణ ఉద్యోగులకు మాత్రం రూ.10 లక్షల ఆదా యం దాటగానే 30 శాతం పన్ను వసూలు చేయడం అన్యాయం. స్టాండర్డ్ డిడక్షన్, 80 సీ పరిమితి యధాతథంగా ఉంచడంతో లాభం లేదు.
నిరాశపరిచిన బడ్జెట్..
కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఒరిగిందేమీ లేదు. నామమాత్రంగా గిరిజన యూనివర్సిటీకి రూ.20కోట్లు కేటాయించి కేంద్రం చేతులు దులుపుకున్నది. ప్రతి ఏటా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉంది. వ్యవసాయం, సాగునీటి పారుదల, విద్య, వైద్యం తదితర రంగాల కేటాయింపుల్లో ఎలాంటి స్పష్టత లేదు. ప్రజలను మభ్యపెట్టే విధంగా కేంద్రం బడ్జెట్ ఉంది.
సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి..
విద్యా, వైద్య రంగాల్లో తెలంగాణ అభివృద్ధికి ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించాలి. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి, నిధులు అందించి రైతాంగానికి బాసటగా నిలవాలి. గంపెడాశతో బడ్జెట్ కోసం ఎదురు చూసిన ఉద్యోగులను బడ్జెట్ నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించేది జీవన భృతే కాని వేతనం కానందున వారిని ఆదాయపన్ను పరిధి నుంచి తొలగించాలి.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమేదీ?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు దేశంలో ఉన్న రైతాంగం, సామాన్యులు, పేదలు, ఉద్యోగులకు అన్యాయం జరిగింది. బడ్జెట్లో మాటల గారడీ తప్పు ఎలాంటి ఉపయోగం లేదు. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనం కల్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తే కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. తెలుగు రాష్ర్టాలకు తీవ్ర నష్టం జరిగింది.
నెల జీతంపైనే ఆధారం..
పెన్షనర్లు, ఉద్యోగులు నెల జీతంపైనే ఆధారపడతారు. కేంద్ర బడ్జెట్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. వేతన జీవుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం శోచనీయం. ఏడేండ్లుగా ఐటీ శ్లాబులను సవరించకపోవడం దారుణం. ఉద్యోగులు, పెన్షనర్ల సహేతుకమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలకు సవరణలు చేయాలి.
ఎదురుచూపులే మిగలాయి..
ఆదాయ పన్ను రాయితీలు కల్పిస్తారని ఆశించిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చెయ్యి చూపింది. ఆదాయ పన్ను శ్లాబులు, స్టాండర్డ్ డిడక్షన్, 80సీ పరిమితి మార్చకుండా యథాతథంగా ఉంచారు. ఏడేండ్లుగా ప్రతి బడ్జెట్లో ఎదురుచూపులు చూడడం, నిరాశ పడడం మామూలైంది. కోట్లలో లాభాలు గడించే కంపెనీలకు మాత్రం కార్పొరేట్ ట్యాక్స్ను 25 శాతానికి తగ్గించారు.
వేతన జీవులకు మరోసారి నిరాశ..
కేంద్రం ఉద్యోగులకు మరోమారు మొండి చేయి చూపింది. ఆదాయ పన్ను శ్లాబ్లు, స్టాండర్డ్ డిడక్షన్, 80సీ పరిమితి మార్చలేదు, ఏడేళ్లుగా ప్రతి బడ్జెట్ కోసం ఎదురు చూపులు చూడటం.. నిరాశ పడటం సాధరణమై పోయింది. కోట్లలో లాభాలు గడించే కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ను 25శాతానికి తగ్గించిన కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రూ.10లక్షలు దాటగానే 30శాతం పన్ను విధించటం అన్యాయం. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను టీఎన్జీవో సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
రాష్టాల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు..
దేశాన్ని పాలించే ఏ పార్టీ అయిన రాష్ర్టాలకు సముచిత స్థానం కల్పించేందుకు చిత్తశుద్ధి చూపించాలి. కానీ, కేంద్ర బడ్జెట్లో ఏ వర్గాలకు నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపింది. కేవలం అంకెలు చూపిస్తూ గారడీ చేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు కన్నా ముందు ప్రత్యేక నిధుల కేటాయింపు ఎక్కడ?. పెట్రో, డీజిల్ ధరల తగ్గింపునకు చర్యలు శూన్యం. వాటిని కప్పి పుచ్చుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని చెప్పడమే నిదర్శనం. వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్ డ్రోన్లను అభివృద్ధి చేయడం కన్నా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. ఇప్పటికే ప్రకటించిన ఏడాదికి కోటి ఉద్యోగాల మాటను నిలుపుకోలేని కేంద్రం.. మేకిన్ ఇండియాలో భాగంగా 60లక్షల ఉద్యోగాల మాటే ఉత్తదే.
మెదక్ రైల్వే లైన్కు నిధులివ్వలేదు..
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో మెదక్ రైల్వే లైన్ కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. గత సంవత్సర బడ్జెట్లో కూడా నామమాత్రంగానే కేటాయింపులు జరిగాయి. ఈ సంవత్సమైనా మెదక్ రైల్వే లైన్ కోసం నిధులు కేటాయిస్తుందని ఆశించాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం బాధాకరం. – తిరుపతి సుభాశ్, మెదక్
వ్యవసాయానికి మొండి చెయ్యి..
కేంద్రం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. వ్యవసాయంపై ఆధారపడి బతికే మాలాంటి వారి ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయం. రోజు రోజుకు వ్యవసాయ రంగం ఇబ్బందులకు గురవుతోంది. ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ప్రధాన కారణం. వరిని కేంద్రం కొనుగోలు చేయకపోవడంతో ఈ ఏడు పంట వేయలేదు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.
మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు..
మహిళల ఆర్థికాభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యం లేదు. కేంద్ర ప్రభుత్వం మహిళల గురించి పట్టించుకోలేదు. మహిళల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాల్సింది. బడ్జెట్పై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆర్థికంగా స్థిరంగా లేని కుటుంబాలు మరింత కిందికి వెళ్తున్నాయి. అభివృద్ధి చెందిన కుటుంబాలు మరింత పైకి ఎదుగుతున్నాయి. మహిళల కోసం కేంద్రం ఆలోచించాల్సింది.
ఉద్యోగులకు ఎటువంటి లాభం లేదు..
వివిధ వర్గాలకు ప్రాధాన్యం కల్పించినప్పటికీ ఉద్యోగులకు మాత్రం బడ్జెట్ నిరాశాజనకంగానే ఉన్నది. ఈ సారి బడ్జెట్లోనూ ఉద్యోగులను నిరుత్సాహపరిచింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు వేతనాలను పెంచడం లేదు. అలాగే, కొవిడ్ నియంత్రణ కోసం అవసరమైన ప్రత్యేక చర్యలు లేవు. ఇంత పెద్ద దేశంలో కొవిడ్ను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి
2022-23 కేంద్ర బడ్జెట్ నిరాశే మిగిల్చింది. మంగళవారం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్, అన్ని వర్గాల ఆశలను ఆవిరి చేసింది. ఆదాయ పన్ను రాయితీలు ఇస్తారని ఆశించిన ఉద్యోగులను కేంద్రం మరోసారి మోసం చేసింది. రైతులకు మేలు చేస్తున్నామని చెప్పే బీజేపీ, బడ్జెట్లో రైతులకు ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది. ఇక ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పథకాలు లేకపోవడం ఆ వర్గాలను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. గాల్లో మేడలు కట్టినట్లు ఉందని, పేదల సంక్షేమాన్ని విస్మరించినట్లు ఉందని, కార్పొరేట్కు తొత్తుగా మారిందని.. ఇలా బడ్జెట్పై ప్రజలు భగ్గుమంటున్నారు.