జిల్లా వ్యాప్తంగా రాములోరి కల్యాణం
యాదాద్రిలో ఆస్థానపరంగా కల్యాణ తంతు
మత్స్యాద్రిలో భక్తిశ్రద్ధలతో మహోత్సవం
రాచకొండ రామాలయంలో థాయ్లాండ్ భక్తుల పూజలు
యాదాద్రి, ఏప్రిల్ 21:ఊరూ వాడా రామ నామస్మరణతో మార్మోగాయి. పల్లెపల్లెలో కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించారు. యాదాద్రిలో ఆ స్థానపరంగా రాములోరి కల్యాణం నిర్వహించారు.శ్రీరామ నవమి సందర్భంగా ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. రాచకొండరామాలయంలో థాయ్లాండ్ భక్తులు పూజలు చేశారు.కల్యాణోత్సవాలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం బుధవారం శైవాగమశాస్త్రరీతిలో కొనసాగాయి.ఈ వేడుకలో పరిమితి సంఖ్యలో ఆలయ అర్చక వేద పండిత బృందంతోపాటు అధికారులు పాల్గొన్నారు. బాల శివాలయంలో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలు, బంగారు ముత్యాల ఆభరణాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. శైవాగమ పద్ధతిలో గణపతికి తొలి పూజతో కల్యాణ తంతు కొనసాగింది. మంగళవాయిద్యాల నడుమ శ్రీరామచంద్రుడు అభిజిత్ లగ్న సుమూహుర్తమున సీతమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. కల్యాణ తంతులో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహామూర్తి దంపతులు, ఆలయ ఏఈవో రమేశ్బాబు, శివాలయ ప్రధాన పురోహితులు, పురోహితులు పాల్గొన్నారు.
వైభవంగా స్వామివారికి నిత్యోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజామునకే స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన నారసింహహోమం అనంతరం నిత్య తిరు కల్యాణ వేడుకలు ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. స్వామివారి అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయ ంత్రం అలంకార జోడుసేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. పరిమితి సంఖ్యలో స్వామివారి ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
సీఎం కేసీఆర్ కోసం పూజలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు యాదాద్రీశుడిని వేడుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ నిండునూరేండ్లు ఆయూఆరోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, కౌన్సిలర్ బూడిద సురేందర్, నాయకులు హేమేందర్గౌడ్, కీసరి బాలరాజు, చిత్తర్ల బాలయ్య, పాండవుల భాస్కర్, శిఖ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆదాయం రూ. 1,51,199
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 1,51,199 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 15,016, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 1,600, కైంకర్యాల ద్వారా రూ. 2,001, సుప్రభాతం ద్వారా రూ. 500, ప్రచారశాఖ ద్వారా రూ. 800, వ్రతాల ద్వారా రూ. 5,500, కల్యాణకట్ట ద్వారా రూ. 5,600, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 85,590, వాహనపూజల ద్వారా రూ. 2,800, టోల్గేట్ ద్వారా రూ. 520, అన్నదాన విరాళం ద్వారా రూ. 1,632, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 11,320, యాదరుషి నిలయం ద్వారా రూ. 5,300, పాతగుట్ట ద్వారా రూ. 1,980, టెంకాలయ విక్రయాల ద్వారా రూ. 11,040తో కలిపి స్వామివారికి రూ. 1,51,199 ఆదాయం సమకూరింది.
సీతారామచంద్రస్వామి కల్యాణం
వలిగొండ, ఏప్రిల్ 21: మండలం వ్యాప్తంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండల కేంద్రంలోని రామాలయం, త్రిశక్తి ఆలయం, మండలంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలోని శ్రీ కోదండరామాలయం, గోకారం, సంగెం, వెల్వర్తి, చిత్తాపురం, సుంకిశాల, మొగిలిపాక, రెడ్లరేపాక, టేకులసోమారం గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా వేద పండితులు నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవంలో ఎంపీపీ నూతి రమేశ్రాజ్, శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి, దేవస్థానం ఈవో కె. రవికుమార్, గోకారం సర్పంచ్ తుర్కపల్లి మాధవీసురేందర్, జాలుకాల్వ సర్పంచ్ మద్దెల సందీప్, వలిగొండ సర్పంచ్ బోళ్ల లలితాశ్రీనివాస్, చిత్తపురం సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి, వెల్వర్తి సర్పంచ్ పసల అన్నామేరి, మొగిలిపాక సర్పంచ్ శశికళారెడ్డి, విద్యాసాగర్రెడ్డి, శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ ఉప్పలయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు.