యూనివర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్లతో గవర్నర్ సమావేశం
రామగిరి, ఏప్రిల్ 23 : ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యే మనకు ఆధారమని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల చాన్స్లర్ తమిళిసై సౌందర్యరాజన్ అన్నారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ వైస్ చాన్స్లర్స్, రిజిస్ట్రార్లతో శుక్రవారం ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్-19పై ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలని కోరారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. 18సంవత్సరాలు నిండిన వారంతా మే 1నుంచి కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రారామచంద్రన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేశామని తెలిపారు. యూజీ, పీజీ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 1నుంచి ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్స్కు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరారు. ఎన్ఎస్ఎస్ 1398 గ్రామాలను దత్తత తీసుకున్నాయని, ఆయా గ్రామాల్లో వలంటీర్లు ప్రజలకు అవగాహన పెంచాలని కోరారు. ఎంజీయూ ఇన్చార్జి, వైస్ చాన్స్లర్, ఐఏఎస్ అరవింద్కుమార్ మాట్లాడుతూ ఎంజీయూ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 163 ఎన్ఎస్ఎస్ యూనిట్స్ పని చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ఎన్ఎస్ఎస్, రెడ్క్రాస్ వలంటీర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యాక్సినేషన్లో పాల్గొంటున్నట్లు గవర్నర్కు వివరించారు. ఎంజీ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.విష్ణుదేవ్ మాట్లాడుతూ ఇప్పటికే ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించి ప్రజలను చైతన్యం చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎంజీయూ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ అల్వాల రవి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ దోమల రమేశ్ పాల్గొన్నారు.