కొల్చారం, ఏప్రిల్ 21: ఎర్రటి ఎండలో ఎదురెక్కి వచ్చిన గోదావరి జలాలతో హల్దీవాగు నిండుగా ప్రవహిస్తున్నది. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలాఖరుకే ఎడారిని తలపించే హల్దీవాగు.. ఇప్పుడు మండుటెండల్లో జలసవ్వడి చేస్తూ పరుగులు తీస్తున్నది. గోదావరి జలాల రాకతో ఇకపై హల్ద్దీవాగు పరిసరాల్లో రెండు పంటల సాగుకు ఢోకా ఉండని రైతులు మురిసిపోతున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ నుంచి 16 రోజులుగా పరుగులు పెడుతున్న గోదారమ్మ, మంగళవారం అర్ధరాత్రి కొల్చారం మండలంలో ప్రవేశించి జలాలు కొంగోడు చెక్డ్యాంను చేరాయి. బుధవారం తెల్లవారుజామున చెక్డ్యాం పొంగిపొర్లి వెల్దుర్తి మండలంలోని శెట్పల్లి వైపు జలాలు పరుగులు పెట్టాయి. తమ గ్రామాన్ని తాకిన గోదావరి జలాలను చూసేందుకు కొంగోడు సర్పంచ్ కుకునూరు మంజుల సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీ ఉదయ వేమారెడ్డి, వార్డు సభ్యులు, రైతులు బుధవారం చెక్డ్యాం వద్దకు చేరుకున్నారు. ఎర్రటి ఎం డల్లో వాగులో నిండుగా పారుతున్న జలాలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మత్తడి దుంకుతున్న నీటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గోదారమ్మకు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
రెండు పంటలకు ఢోకాలేదు..
వానలు పడ్తే పంటలు పండేవి… లేకుంటే ఎండిపోయి సాగు పెట్టుబడులు రాక అప్పుల్లో కూరుకుపోయేవాళ్లం. ఇప్పుడు గోదావరి నీటితో హల్దీవాగుపై చెక్డ్యాంలు మత్తడి దుంకుతుండడంతో మా ఆనందానికి అవధుల్లేవు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో గోదావరి నీళ్లు వచ్చాయి. ఇకపై హల్ద్దీవాగు ఆయకట్టు కింద రెండు పంటల సాగుకు ఢోకా ఉండదు.
-గంపల లక్ష్మణ్, రైతు, కొంగోడు (మెదక్ జిల్లా)
సీఎం కేసీఆర్కు రైతులు రుణపడి ఉండాలి
గోదావరి జలాలతో బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారనున్నాయి. ఎన్నో పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. స్వయానా రైతు అయిన సీఎం కేసీఆర్ కంకణబద్ధ్దులై ఇలాంటి అసాధ్యమనుకున్న పనులు సుసాధ్యం చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
–పట్నం యాదగిరి, రైతు, కొంగోడు (మెదక్ జిల్లా)