కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 27 : కరోనా వైద్య సేవలను విస్తరించాలని అర్బన్ కలెక్టర్ ఆర్జీ హన్మంతు ఎంజీఎం, కేఎంసీ అధికారులను ఆదేశించారు. కేఎంసీ ఆవరణలోని పీఎంఎస్ఎస్వై (ప్రధానమంత్రి స్వస్థ్ సంరక్షణ యోజన) సూపర్ స్పెషాలిటీ దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఎంజీఎంలో అందిస్తున్న అత్యవసర, సూపర్స్పెషాలిటీ వైద్యసేవలను అవసరాన్ని బట్టి కేఎంసీ సూపర్స్పెషాలిటీ దవాఖానకు తరలించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. తప్పని పరిస్థితులు ఎదురైతే తరలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో సాధారణ శస్త్రచికిత్సలను నిలిపివేయడంతో సూపర్స్పెషాలిటీ రోగుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎంజీఎంలోని వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్ల సలహాలు, సూచనలు తెలుసుకున్న ఆయన ప్రస్తుతం సూపర్స్పెషాలిటీ దవాఖానలో పది రకాల వైద్యసేవలకు అవసరమైన యంత్రపరికరాలు, పారామెడికల్ విభాగాలు అందుబాటులో ఉండడంతో అత్యవసర, సూపర్స్పెషాలిటీ వైద్యసేవల తరలింపుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, పలువురు విభాగాధిపతులు, ప్రొఫెసర్లు ఉన్నారు.