తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్లో సాగు
సంగారెడ్డి జిల్లాలో 3వేల ఎకరాల్లో పంట
ఇక్కడ సాగుకు అనుకూల వాతావరణం
ఆలు రైతులకు సర్కారు ప్రోత్సాహం
సబ్సిడీపై బిందుసేద్యం పరికరాలు అందజేత
కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు చర్యలు
జహీరాబాద్, నవంబర్ 8 : ఆలు సాగుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం కేరాఫ్ అడ్రస్గా మారింది. జిల్లాలో సాగుకు అనుకూల వాతావరణం ఉందని జాతీయ ఆలుగడ్డ పరిశోధనా కేంద్రం తేల్చింది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో సాగు గణనీయంగా పెరుగుతున్నది. ఈ యాసంగిలో సంగారెడ్డి జిల్లాలో 3వేల ఎకరాల్లో పంట సాగుచేస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ తెలిపింది. ఆలు రైతుల పంట పొలాలను పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి, అధిక దిగుబడులకు సలహాలు, సూచనలు అందిస్తున్నది. సాధారణ సాగుతో ఎకరానికి 10టన్నుల దిగుబడి వస్తే, డ్రిప్ పద్ధతితో 12 టన్నుల దిగుబడి వస్తున్నది. ఒక ఎకరంలో 150బస్తా(ఒక్కో బస్తా 70కేజీలు)లు తగ్గకుండా పండుతున్నది. ఇక్కడ నల్లరేగడి, ఎర్రరేగడి భూములుండగా, నల్లరేగడిలో పండిన దుంపలకు డిమాండ్ బాగుంది. ఆలు రైతుకు మద్దతు ధరతో పాటు పంట నిల్వకు శీతలగిడ్డంగి నిర్మిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం ఆలుగడ్డ సాగుకు కేంద్రంగా మారింది. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల రైతాంగం అధికంగా సాగుచేస్తున్నది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ రాష్ర్టాల నుంచి ఆలు విత్తనాలను తీసుకొచ్చి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పంట పండిస్తున్నది. అధిక లాభాలు వస్తుండడంతో అన్నదాత దృష్టి ఆలుపై పడింది. ఆలుసాగుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని జాతీయ ఆలుగడ్డ పరిశోధనా కేంద్రం పేర్కొంది. రోజురోజుకూ సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. తెలంగాణలో ఉన్న ఉద్యాన శాఖ అధికారులు హిమాచల్ప్రదేశ్, సిమ్లా, తమిళనాడులోని ఊటీలో ఉన్న జాతీయ ఆలుగడ్డ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించి, రైతులకు పంట సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. యాసంగిలో ఆలు సాగుకు అనుకూలమైన వాతావరణం, భూములు జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు వారు సిఫార్సు చేశారని ఉద్యాన శాఖ అధికారులు చెప్పారు. ఇక్కడ కుప్రీ, సూర్య, జ్యోతి, చిప్సోన-3తో పాటు పలు రకాలు ఆలు సాగు చేస్తే, ఎక్కవ రోజులు నిల్వ చేసుకొనే అవకాశం ఉందని అధికారులు వివరించారు. సాధారణ సాగుతో ఎకరానికి 10టన్నుల దిగుబడి వస్తే, డ్రిప్ పద్ధతితో 12 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. పుఖ్రాజ్ రకం వంగడం ఎక్కువ దిగుబడి ఇస్తున్నదని, హెక్టారుకు 400 క్వింటాళ్ల దిగుబడి లభించే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగు పద్ధతి పాటిస్తే, ఎకరానికి 12టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ఆలుకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుందన్నారు.
తెలంగాణలో జహీరాబాద్లోనే అధికంగా..
తెలంగాణలో అధికంగా ఆలు సాగును జహీరాబాద్ ప్రాంతంలో యాసంగి పంటగా రైతులు సాగు చేస్తున్నారు. ఆలు విత్తనాలను ఢిల్లీ, ఆగ్రా నుంచి తెచ్చి, పండిస్తున్నారు. ఇక్కడ అధికంగా పంటలు పడిస్తూ శీతల గిడ్డంగులు లేనందున వెనువెంటనే రైతులు పంటను అమ్మేస్తున్నారు. జహీరాబాద్లో ఉత్పత్తి చేసిన ఆలుగడ్డను వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీతో పాటు ఆంధ్రలో ఉన్న మార్కెట్కు సరఫరా చేసి అమ్మకాలు చేస్తున్నారు. సీజన్లో వ్యాపారులు జహీరాబాద్లో ఉండి రైతుల పొలంలోనే ఆలును కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలు రైతులకు గిట్టుబాటు ధరతో పాటు పంట నిల్వ చేసుకునేందుకు శీతలగిడ్డంగి నిర్మిస్తామని ప్రకటించింది. గతంలో ఏ ప్రభుత్వం ఆలు రైతులను పట్టించుకోలేదు.
అధిక దిగుబడులు సాధించేందుకు పరిశోధన…
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో గల జాతీయ ఆలుగడ్డ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు జహీరాబాద్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, దిగుబడి పెంచేందుకు రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు. బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేసేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.