యాదాద్రి, ఏప్రిల్ 15 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాయంలోని వెలుపలి ప్రాకారంలోని అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగిన సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. స్వయంభూ నారసింహుడి ప్రధానాలయంలోని ఊయలలో శయనింపు సేవ చేశారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొలుస్తూ లాలిపాటల కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి నిత్యారాధనలను అర్చక బృందం వైభవంగా చేపట్టారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. బిందె తీర్థం నిర్వహించి స్వామిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. నిజాభిషేకం, సహస్రనామార్చన జరిపారు. ప్రధానాలయంలోని ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.600 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన చేశారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కొండకింద కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి ఆ పక్కనే లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి దేవాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో కొండపైకి చేరుకుని స్వయంభువులను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత దర్శనాలు కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామివారి ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. శ్రీవారి ఖజానాకు రూ.22,96,096 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,39,600
వేద ఆశీర్వచనం 4,800
సుప్రభాతం 5,800
క్యారీ బ్యాగుల విక్రయం 25,000
వ్రత పూజలు 1,16,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 30,000
ప్రసాద విక్రయం 15,25,800
వాహనపూజలు 9,600
అన్నదాన విరాళం 31,605
సువర్ణ పుష్పార్చన 1,83,200
యాదరుషి నిలయం 78,280
శాశ్వత పూజలు 12,500
పాతగుట్ట నుంచి 64,030
గోపూజ 100
లక్ష్మీ పుష్కరిణి 800
లీజులు 60,181
ఇతర విభాగాలు 8,800