కొడంగల్, అక్టోబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమాతో రైతు కుటుంబానికి ఎంతో భరోసానిస్తుందని అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులపై ఆధారపడ్డ పంట భూములు, అతివృష్టి, అనావృష్టితో ప్రతి సంవత్సరం ఏదో రకంగా నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వాపోతున్నారు. అన్నదాతలను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలులో లేని విధంగా రైతు బంధు, రైతు బీమాతో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుంట భూమి ఉన్న రైతులకు కూడా రైతు బీమాను వర్తింప జేయడంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే కుటుంబం రోడ్డున పడకుండా కుటుంబానికి రూ.5లక్షలు అందిస్తూ అండగా నిలుస్తున్నదని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలోనే నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు అందుకున్న వారికి కూడా రైతు బీమా వర్తింప జేసేలా ప్రభుత్వం ధరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ధరఖాస్తు చేసుకున్న కుటుంబానికి సాయాన్ని అందించడంపై అన్నదాతలు ధీమాగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో లక్షా20వేల ఎకరాల సాగు భూమి ఉంది. 48,518 మంది రైతులు ఉన్నారు. 2020 సంవత్సరంలో 26,739 మంది రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 3 వరకు రైతు బీమాకు ధరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో కొత్తగా 2977మంది దరఖాస్తులు అందించింగా ప్రస్తుతం 29,716మంది లబ్ధిదారులు ఉన్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఇందులో ప్రస్తుతం 194 మంది రైతులు మృతిచెందగా వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మొత్తంగా 9కోట్ల70లక్షలు నామినీ బ్యాంకు ఖాతాల్లో జమ కాబడినట్లు పేర్కొన్నారు.
రైతు కుటుంబానికి భరోసా : ఏడీఏ వినయ్కుమార్
ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్నది. గుంట భూమి ఉన్న అన్నదాతకు కూడా రైతు బీమా వర్తిస్తుంది. నియోజకవర్గ పరిధిలో 245 మంది రైతులు దరఖాస్తు ఇందులో 194 మంది రైతులకు రైతు బీమా చెల్లింపులు జరిగాయి. 31 దరఖాస్తులకుగాను ఎల్ఐసీలో పెండింగ్లో ఉన్నాయి. 5 దరఖాస్తులు తిరిగిపంపగా.. డీఈవో కార్యాలయంలో 8, ఏఈవో వద్ద 1 దరఖాస్తు పెండింగ్లో ఉన్నాయి. 2021లో 5 దరఖస్తులు రాగా పంపించాం.
ట్రాక్టర్ అప్పు తీర్చుకున్నాం : ఎండీ సాధిక్, పర్సాపూర్, కొడంగల్
రైతు బీమా పథకం ఎంతో ఆసరా కల్పిస్తున్నది. మా అమ్మ కమారున్న్నీసాబేగం మృతిచెందగా ప్రభుత్వం రూ.5లక్షల రైతు బీమా మంజూరు చేసింది. ఆ డబ్బుతో ట్రాక్టర్ అప్పు తీర్చుకున్నాం. రైతు కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయినప్పటికీ సీఎం కేసీఆర్ అండగా నేనున్నానని రైతు బీమాతో భరోసాను కల్పించడం చాలా సంతోషంగా ఉంది.
మా కుటుంబాన్ని ఆదుకుంది
-కెతావత్ సక్రీబాయి,
గాజులకుంటతండా, బొంరాస్పేట్
నా భర్త చెరువులో పడి చనిపోతే రైతు బీమా ద్వారా వారం రోజుల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందింది. ఈ సహాయం మా కుటుంబాన్ని ఎంతోగానో ఆదుకుంది. చేసిన అప్పులు తీర్చుకున్నాం. రైతులకు కేసీఆర్ దేవుడిగా మారి ఆదుకుంటున్నాడు. ఇలాంటి సహాయం ఇచ్చినట్లు ఎప్పుడూ చూడలేదు.