డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్
ఆర్జీ-1లో పర్యటన
గోదావరిఖని, ఏప్రిల్ 26: సింగరేణి ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ సూచించారు. ఆర్జీ-1 పరిధిలో సోమవారం ఆయన పర్యటించారు. ముం దుగా స్థానిక ఏరియా దవాఖానను సందర్శించిన ఆయన కరోనా తీవ్రత పెరుగుతున్నందున వైద్యశాలలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరోనా ఐసొలేషన్ వార్డు, పరీక్షలు, వ్యాక్సినేషన్ సెంటర్, ఐసీయూ, ఎక్స్రే గది, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు. ఉద్యోగులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని, అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి కార్మికుడు వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలన్నారు. ఇక్కడ ఆర్జీ-1 జీఎం కే నారాయణ, ఎస్వోటూ జీఎం త్యాగరాజు, డీవైసీఎంవో కిరణ్ రాజ్కుమార్, పర్సనల్ డీజీఎం రమేశ్, రత్నమాల, యాదవరెడ్డి, సంక్షేమాధికారి శ్రీనివాస్, ఎస్వో వీరారెడ్డి ఉన్నారు. అలాగే మేడిపల్లి ఓసీపీని సందర్శించి బొగ్గు వెలికితీత పనులను పర్యవేక్షించారు. కలిసికట్టుగా ఉత్పత్తి సాధించాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తి, ఉత్పాదకత పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. పని స్థలాల్లో కొవిడ్ నిబంధనలను కఠినతరం చేయాలని డైరెక్టర్ సూచించారు.