శివరాత్రి వ్రతం హ్యేతత్ కరిష్యేహం మహా ఫలం
నిర్విఘ్నం కురుమేదేవాత్ర త్వప్రసాదాజ్జగత్పతే॥
‘ఓ జగదీశ్వరా! మహా ఫలితాన్నిచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలా చూడు. ముక్తిని కోరుతూ ఈ రోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక్కపొద్దు విడిచి భోజనం చేస్తాను. దయతో నన్నెప్పుడూ రక్షిస్తూ ఉండుమ’ని శివుణ్ని వేడుకొని శివరాత్రి రోజున విధిగా ఉపవాసం చేయాలని శాస్త్ర వచనం.
శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించే వాడని అర్థం. ఈ విశ్వాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నదీ ఇదే రోజు. క్షీరసాగర మథనంలో పుట్టిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తీసుకొని, తన కంఠంలో దాచుకుని శివుడు నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే. అందుకే శివర్రాతి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించడం కోసం, శివలింగానికి అభిషేకాలు నిర్వహించి, ఉపవాస దీక్ష చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ ఉపవాస నియమం అందరికీ మేలు చేస్తుంది. మాఘమాసం వరకూ మందగించి ఉండే జీర్ణవ్యవస్థ, వేసవి రాకతో తీవ్రం అవుతుంది. శీతకాలం, వేసవి సంధికాలంలో వచ్చే శివరాత్రి నాడు ఉపవాసం చేయడంతో శరీరం వాతావరణంలో జరిగే మార్పులకు తగినట్లుగా సిద్ధమవుతుందని చెబుతారు.
– డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370