Devotion | మంత్రతంత్రాలతో పూజ చేస్తేనే భక్తి అంటారా? యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తేనే భక్తులా? ఏది భక్తి? ఎవరు భక్తుడు? భక్తి మనలో కలిగే చలనం. భక్తుడు సమాజాన్ని మార్చగలిగే సంచలనం. భగవంతుడిని చూడాలనే నిరంతర అన్వేషణే తపస్సు! అందరిలోనూ భగవంతుడిని దర్శించడమే శ్రేయస్సు!!
ఏ వేదాలు పఠించి
సాలీడు హరుడి కరుణ పొందింది.
ఏ శాస్ర్తాలు చదివి భుజంగం నాగభూషణుడి
అనుగ్రహం అందుకుంది.
ఏ విద్యలు అభ్యసించిందని ఏనుగుకు
పరమేశ్వరుడి దర్శనభాగ్యం దక్కింది.
భక్తి పథంలో భగవంతుడికి తరతమ భేదాలు ఉండవని నిరూపించిన శ్రీకాళహస్తీశ్వరుడి కథ ఇది. భగవంతుడు నావాడు అనుకోవడమే అసలైన భక్తి. ఈ చరాచర సృష్టిలో అణువణువూ దైవం నిండి ఉన్నదని గ్రహించినవాడే సిసలైన భక్తుడు. తన మదిలో, ప్రతి హృదిలో దేవుణ్ని చూసిన వాడే నిఖార్సయిన సాధకుడు.
భక్తి అనే పదం వింటేనే మానవుడిలో తెలియకుండానే ఒక చలనం కలుగుతుంది. తనలో భక్తి పొటమరించే కొద్దీ ఆ భక్తుడే సంచలనంగా మారుతాడు. ఈ చలనం (గమనం), సంచలనం( పురోగమనం) మానవుని మనుగడలో, మానవజాతి పురోభివృద్ధిలో అనాదిగా దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అందుకే, ఇతర జంతువులకు మానవులకు ఆహారం, నిద్ర మొదలైనవి సమానమే! కాని, ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలను సాధించగలిగే, పొందగలిగే యోగ్యత మనిషికే ప్రసాదించాడు భగవంతుడు. అందులోనూ పరమ పురుషార్థంగా పేర్కొన్న మోక్షాన్ని సాధించాలంటే మన శాస్ర్తాలు ప్రధానంగా మూడు మార్గాలను ఉపదేశించాయి. అవే జ్ఞానం, కర్మ, భక్తి.
మోక్ష సాధనలో జ్ఞానం, కర్మ మార్గాలు కొన్ని పరిమితులకు లోబడి సర్వజన సాధారణం కాలేకపోయాయి. అంటే, జ్ఞాన, కర్మ సాధన అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, అందరికీ అనువైన మోక్ష మార్గం భక్తి. ఈ మార్గంలో చిన్నాపెద్దా వ్యత్యాసం ఉండదు. పేద-గొప్ప తేడాలు ఉండవు. అందరూ అతిసులభంగా అనుసరించగలిగే మార్గం ఇది. అందుకే శ్రీ శంకర భగవత్పాదులు వివేకచూడామణిలో ‘మోక్షసాధన సామగ్య్రాం భక్తిరేవ గరీయసీ- భక్తి మానవుడికి మోక్ష సాధనలో ముఖ్య సాధనం’ అని తెలియజేశాడు. శ్రీకృష్ణ
భగవానుడు ‘మన్మనా భవమద్భక్తః- తనయందు అనన్యమైన భక్తి కలవాడు తనను పొందగలడు’ అని భగవద్గీతలో పేర్కొన్నాడు.
ఇంతకీ భక్తి అంటే ఏమిటి? ఇదే విషయాన్ని నారద మహర్షి ‘భక్తి సూత్రాల్లో’ ప్రస్తావిస్తూ ‘సాత్వస్మిన్ పరమప్రేమరూపా’ అని పేర్కొన్నాడు. అంటే, భగవంతుడిపై అనన్యమైన ప్రేమ కలిగి ఉండటమే నిజమైన భక్తి అని నిర్వచించాడు. ఇదే మార్గాన్ని అనుసరించి శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందారు గోపికలు.
‘చిత్తం సుఖేన భవతాపహృతం గృహేషు
యన్నిర్విశత్యుత కరావపి గృహ్యకృత్యే
పాదౌ పదం న చలతస్తవ పాదమూలాద్యామః
కథం వ్రజమథో కరవామ కిం వా’
‘కృష్ణా మా మనసును హరించావు. ఇక మేము ఎటు వెళ్లేది- ఎటూ వెళ్లలేమ’ని అన్నారు. అవ్యాజమైన ప్రేమతో మురళీమోహనుడి మనసును గెలుచుకున్నారు. దీన్నే అనన్యమైన భక్తి అంటాడు నారదముని. ‘అన్యాశ్రయాణాం త్యాగో అనన్యతా’ అంటే గోపికల్లా అన్నీ వదిలేసి భగవంతుడిపైనే మనసును లగ్నం చేయాలని సూచించాడు మహర్షి. భాగవతం, ఇతర పురాణ ఇతిహాసాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి భక్తులు భగవంతుడిని ఆశ్రయించి పొందిన అనుభూతులు అద్భుతాలే!
‘మద్భక్తివిముఖానాం హి శాస్త్రగర్తేషు ముహ్యతాం
న జ్ఞానం న చ మోక్షః స్యా త్తేషాం జన్మశతైరపి’
‘ఎంత గొప్ప శాస్త్ర పండితుడికైనా నాయందు భక్తి లేనట్లయితే, ఎన్ని జన్మలెత్తినా వారికి జ్ఞానం రాదు, మోక్షం లభించదు. భక్తి లేని శాస్త్రపాండిత్యం నెత్తిన బండరాయిలా భారమే తప్ప ఉపయోగం లేద’ని సాక్షాత్తూ పరమేశ్వరుడు భక్తి ఔన్నత్యాన్ని తెలియజేశాడు. ఇంతటి సర్వోత్కృష్టమైన భక్తికి నారదమహర్షి, మధుసూదనసరస్వతి మహాపురుషుల సేవతో ఆరంభించి భగవంతుడిపై పరిపూర్ణమైన ప్రేమ కోసం పదకొండు భూమికలను (సాధనాలను) ప్రతిపాదించారు.
మహాత్ములను సేవించడం, సేవతో వారి అనుగ్రహాన్ని పొందడం, వారు ఆచరిస్తున్న ధర్మంపై శ్రద్ధ కలగడం, శ్రీహరి గుణాలను వినడం, శ్రీహరిపై అనురక్తి కలిగి ఉండటం, హరి స్వరూపాన్ని తెలుసుకోవడం, అలా తెలుసుకున్న పరమానంద రూపం మీద ప్రేమ ఉత్పన్నం కావడం, ఆ ప్రేమలో పరమానంద అనుభూతిని పొందడం, భగవత్ సంబంధమైన ధర్మంపై నిష్ఠ కలగడం, ధర్మనిష్ఠ ఏర్పడటంతో భగవత్ గుణాలు వ్యక్తం కావడం, ఫలితంగా భగవంతుడిపై ప్రేమ అభేద స్వరూపమై పరాకాష్ఠకు చేరడం.. ఈ పదకొండు అంచెలను దాటినవారు భగవంతుడిపై అచంచలమైన ప్రేమను పొందుతారు. భగవంతుడి సన్నిధిలేక ఉండలేని స్థితికి చేరుకుంటారు. అదే నిజమైన భక్తి. ఈ స్థితి పొందినవారు ‘యత్ప్రాప్య న కించిద్వాంఛతి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి- అద్వితీయమైన బ్రహ్మానుభూ తిని కలిగి ఉంటారు’ అని తెలియజేశాడు నారదుడు. భక్తి అహంకార రహితమై ఉండాలి. ఆడంబరాలకు దూరంగా ఉండాలి. ప్రచార ఆర్భాటం, పదిమంది మెప్పు కోసం ప్రదర్శించేది నిజమైన భక్తి అనిపించుకోదు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం
శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన ఈ తొమ్మిది మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు. వీటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు. భక్తుడు తనకున్న శక్తి సామర్థ్యాలు, అవకాశాన్ని బట్టి ఈ తొమ్మిది మార్గాల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు. ఏ మార్గాన్ని ఎన్నుకున్నా తుది ఫలితం దైవ సన్నిధానమే!
‘రెక్కలు రాని పక్షి పిల్లలు.. తమ తల్లి కోసం, తల్లి వచ్చి ఇచ్చే పాల కోసం లేలేత లేగదూడ చూసే ఎదురు చూపే భక్తి. దేశాంతరం వెళ్లిన ప్రియుడి కోసం బాధతో ప్రియురాలు చూసే ఎదురుచూపే భక్తి. అలాగే, భగవంతుడిని చేరాలనే తపన కలిగి ఉండటమే భక్తి’ అని ‘భక్తి సుధా’ గ్రంథంలో వివరించాడు కరపత్రిస్వామి.
భక్తులు అనిపించుకోవాలంటే గంటలకొద్దీ పూజలు చేయాలన్న నియమం లేదు. మనం చేసే సత్కర్మలన్నీ భగవంతుడి ప్రీత్యర్థం చేయడమూ భక్తే! గ్రామదేవతకు బోనాలు సమర్పించే క్రమంలో గ్రామీణుల్లో నిష్కల్మషమైన భక్తి ప్రపత్తులు కనిపిస్తాయి. ఆశ్వయుజ మాసంలో ఆలయాల్లో అమ్మవారికి వేదమంత్రాలతో నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. అదే సమయంలో ఆడబిడ్డలు ఆప్యాయంగా బతుకమ్మ పేర్చి, అనురాగాల రాగాలతో బతుకమ్మ పాటలు పాడుతూ అమ్మవారిని కీర్తించడంలోనూ అసామాన్యమైన భక్తి ఉంటుంది. భగవంతుడిపై మనకు కలిగే భావన బలంగా ఉండాలంటారు పెద్దలు. భక్తి భావన మనసులో బలంగా నాటుకుంటే, హృదయంలోనే దేవుడు కొలువై ఉంటాడు.
జూన్లో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇవే !
దేవుడికి ముడుపు కట్టడం అంటే ఏమిటి?