దేవుడికి ముడుపు కట్టడం అంటే ఏమిటి?
ఎస్.గ్రీష్మ, నిజామాబాద్
దేవుడికి మొక్కు చెల్లించడానికి కొంత ద్రవ్యాన్ని ఒక వస్త్రంలో కట్టి సమర్పించే ప్రక్రియనే ముడుపు కట్టడం అంటారు. అది దేవుడికి అంకితభావంతో చేసే నివేదన. ఇబ్బందుల నుంచి గట్టెక్కడం కోసం, ధర్మబద్ధమైన కోరిక నెరవేరడం కోసం ఇష్టదైవం పేరిట ముడుపు కట్టే సంప్రదాయం ఉన్నది. దైవ దర్శనం తర్వాత మనసులోని కోరిక చెప్పుకొని ఆలయ ప్రాంగణంలోని దేవతా వృక్షానికి దీనిని కడతారు. కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గరే ముడుపు కట్టి, ఆలయానికి వెళ్లినప్పుడు దానిని చెట్టుకు గానీ, నిర్దేశించిన ప్రదేశంలో గానీ ఉంచుతారు. ముడుపు కట్టడానికి ముందు దీపారాధన చేయాలి. గణపతిని పూజించి, ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. పసుపులో తడిపి ఆరబెట్టిన వస్ర్తాన్ని కుంకుమతో అలంకరించి, అందులో కొబ్బరికాయ, యథాశక్తి డబ్బులు ఉంచుతారు. ముడుపు కడుతున్న కారణాన్ని మనస్ఫూర్తిగా దైవానికి చెప్పుకొని మూడు ముడులు వేసి ముడుపు కడతారు. అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత ముడుపుతో దర్శనానికి వస్తానని మొక్కుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపును ఆలయానికి వెళ్లి స్వామివారికి చెల్లించి మొక్కు తీర్చుకుంటారు. అయితే, ముందుగానే ఆలయాల్లో ముడుపు కట్టినప్పుడు, అనుకున్న కార్యం నెరవేరిన తర్వాత మళ్లీ దైవ దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంది.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370