తిరుమల : జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ప్రకటించింది. జూన్ 1న మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేక తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 3న శ్రీ నమ్మాళ్వార్ల ఉత్సవారంభం, 10న వసంత మండపంలో విష్ణు అర్చనం, పూజ, 12 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి జ్యేష్టాభిషేకం, 29న శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నిన్న శ్రీవారిని 90,885 మంది దర్శించుకోగా 35,707 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చిందని తెలిపారు. స్వామివారి దర్శనానికి భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని తెలిపారు. వీరికి 6 గంటల్లో దర్శనం అవుతుందని వివరించారు.