తిరుపతి : కల్యాణమస్తుతో పాటు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ కార్య నిర్వాహక మండలి తీర్మానించింది. శ్రీవారి ట్రస్ట్ ద్వారా దేవాదాయశాఖ నేతృత్వంలో రాష్ట్రంలో 1,072 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం సాయంత్రం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది. రాష్ట్రలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఒక్కో ఆలయం రూ.10లక్షల వ్యయంతో ఏడాదిలోపు 1,072 ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని తీర్మానించారు.
ప్రతిమాసం దేశంలోని ప్రధాన కేందాల్లో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న కర్నాటక చిక్బళ్లాపూర్లోను, మే 8న భద్రద్రాది కొత్తగూడెంలోనూ స్వామివారి కల్యాణాలను నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, మే నెలలో ఢిల్లీలో, జూన్లో హైదరాబాద్లోనూ, జూన్ 23 నుంచి జూలై 4 వరకు అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సమాయత్తం కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లాల్లో కూడా త్వరలోనే శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
కొవిడ్ పరిస్థితుల నుంచి బయపడినందు వల్ల సామూహిక వివాహాల నిర్వహణ కోసం పండిత మండలిని ఏర్పాటు చేశారు. మండలి నిర్ణయించే పవిత్ర ముహూర్తాల్లో జిల్లా యంత్రాంగాల సహకారంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఒక యజ్ఞం నిర్వహించాలని, మే నెలలో తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో నిర్మించిన ఆలయాల్లో అర్చకులుగా పనిచేసేందుకు ముందుకొచ్చే వారికి దేవాదాయ శాఖ సహకారంతో తిరుపతిలో శిక్షణకు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
గుడికో గోమాత కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు దేశంలోని 141 ఆలయాలకు ఉచితంగా గోవు, దూడ అందించారని, ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని టీటీడీ, దేవాదాయ శాఖ భూముల్లో గో ఆధారిత వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని, వారు పండించిన ఉత్పత్తులను తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
హెచ్డీపీపీ విభాగానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. ఈవో కేఎస్ జవహర్రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం సమావేశానికి హాజరవగా.. ధర్మకర్తల మండలి సభ్యులు అల్లూరి మల్లీశ్వరితో పాటు ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి, ఏఈవో సత్యనారాయణ వర్చువల్లో
పాల్గొన్నారు.