శ్రీబాలాజీ జిల్లా : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీచిన్నజీయర్స్వామి, టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డితోపాటు పలువురు రుత్వికులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ బడ్జెట్ లెక్కలు ప్రారంభమయ్యాయి. సాలకట్ల ఆణివార ఆస్థానం నుంచి కొత్త బడ్జెట్ లెక్కలు అమలుచేస్తారు. సాలకట్ల ఆణివార ఆస్థానం ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకీపై స్వామి, అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ముందుగా ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.
అనంతరం శ్రీ పెద్దజీయర్స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీ చిన్నజీయర్స్వామి, ఈఓ ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులకు అలంకరించారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తన తలకు శ్రీవారి పాదవస్త్రంతో ‘పరివట్టం’ (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత అర్చకులు శ్రీ పెద్దజీయంగార్, శ్రీ చిన్న జీయంగార్, టీటీడీ తరఫున ఈఓ ధర్మారెడ్డికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసింది.
ఈ సందర్భంగా ఈఓ ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అయితే, సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చిందన్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుంచి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి-ఏప్రిల్ నెలలకు మార్చినట్టు వివరించారు.