Tirumala Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం రాత్రి మలయప్పస్వామి గజేంద్ర మోక్ష అలంకరణలో తిరుమాడ వీధుల్లో సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వాహనసేవలో కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా.. భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ నేత్రపర్వంగా సాగింది.
బ్రహ్మవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై విహరించనున్నారు. సేవకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అన్నీ ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ సీవీఎస్ఓ నరసింహ కిశోర్ తెలిపారు. భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, వాహనసేవ కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గ్యాలరీలు నిండిపోయి ఇన్నర్ రింగ్ రోడ్డులో వేచి ఉన్న భక్తులను మాడవీధుల్లోని కార్నర్లలో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అనుమతించి గరుడ వాహనం దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు.