Tirumala Brahmotsavam | తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదోరోజైన గురువారం రాత్రి శ్రీవారి గరుడ సేవ నయనానందకరంగా సాగింది. గరుడ వాహనంపై మాఢవీధుల్లో విహరిస్తూ.. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనమిచ్చారు. గరుడ సేవ సందర్భంగా తిరువీధులన్నీ భక్కులతో నిండిపోగా.. గోవింద నామస్మరణతో మారుమోగాయి. వేదపండితుల మంత్రాలు, గోవిందనామాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, దేవతామూర్తుల కళారూపాలు, కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
లక్షకుపైగా భక్తులు గ్యాలరీల్లో బారులు తీరి స్వామివారిని కనులారా దర్శించుకున్నారు. ఉదయం మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.