Satyakama Jabala | ఛాందోగ్య ఉపనిషత్తులోని సత్యకాముడి కథ సత్యవాక్ పరిపాలన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సత్యకాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను ఒకరోజు తన తల్లి దగ్గరికి వచ్చి.. ‘అమ్మా! మన గోత్రం ఏమిటి? సద్గురువు దగ్గర బ్రహ్మచర్య దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నా. వారు గోత్రం ఏంటని అడిగితే ఏమని చెప్పాలి?’ అని అడిగాడు. తల్లి మథనపడుతూ ఇలా చెప్పింది. ‘నాయనా! నాకు తెలియదు. నా యౌవనంలో ఎక్కడెక్కడో తిరిగాను. ఎందరినో సేవించాను. నీవు పుట్టావు. నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. నా పేరు జాబాలి. నీ పేరు సత్యకామ. గురువుగారు అడిగితే సత్యకామ జాబాలిని అని చెప్పు’ అన్నది. సత్యకాముడు.. గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరాడు. మహర్షి గోత్రం అడిగితే తల్లి చెప్పినట్టే చెప్పాడు.
‘సత్యవాదే ఇలా పలుకగలడు. సమిధలు తీసుకురా! ఉపదేశం చేస్తా’ అన్నాడు గౌతముడు. సంప్రదాయ హోమం జరిగింది. బ్రహ్మచర్య దీక్ష తీసుకొని సత్యకాముడు గౌతముని శిష్యుడయ్యాడు. ఒకనాడు గౌతముడు 400 ఆవులను అప్పజెపుతూ ‘వీటిని జాగ్రత్తగా పెంచు. 1000 అయిన తర్వాత తిరిగిరా!’ అన్నాడు. సత్యకాముడు గురువు సంతృప్తి కోసం ఎంత కష్టమైనా పడాలని భావించాడు. వాటిని అరణ్యానికి తీసుకువెళ్లాడు. కొన్నేండ్లు గడిపాడు. సత్యాన్వేషణ తత్పరుడైన అతనికి ప్రకృతి పాఠాలు నేర్పింది. ఆవులు, ఆబోతులు, చెట్లు, పిట్టలు, సెలయేర్లు, నక్షత్రాలు, సూర్యచంద్రులు సందేశాలు ఇచ్చాయి.
పశువుల సంఖ్య వెయ్యి అయింది. క్రమంగా ఒక ఆబోతు, అగ్ని, ఒక హంస, ఒక నీటిపక్షి బ్రహ్మంలోని ఒక్కొక్క పాదాన్ని గురించి సత్యకాముడికి వివరించాయి. ‘ఈ నాలుగు పాదాలు కలిస్తే పరబ్రహ్మం అవుతుందని భ్రమించకు. నీవు విన్నదంతా బ్రహ్మంలో పావుభాగానికే రావచ్చు’ అని పలికింది నీటి పక్షి. సత్యకాముడు ఆవులతో ఆశ్రమానికి చేరుకున్నాడు. అతని ముఖస్థమై ఉన్న బ్రహ్మకళను గుర్తించిన గురువు అతనికి సర్వ విజ్ఞానాన్నీ ధారపోశాడు. సత్యవాక్ పరిపాలనమే బ్రహ్మజ్ఞానానికి అర్హత అని సత్యకాముడి గాథ తెలియజేస్తున్నది. బ్రహ్మజ్ఞానానికి అర్హుడైన మనిషికి.. మానుషులే గురువులు కావాల్సిన పనిలేదు. పశుపక్ష్యాదులు, పంచభూతాలు కూడా జ్ఞానాన్ని ప్రేమతో అందిస్తాయి.
– డా.వెలుదండ సత్యనారాయణ