క్రీస్తు జననం అద్భుతం. ప్రభువు జీవనం ఆదర్శం. బోధనలు ఆచరణీయం. విశ్వాసులకు ఆయన మాట ఊరట. అజ్ఞానులకు ఆయన చేత కనువిప్పు. ఆ మహనీయుడి జీవితంలోని ప్రతి ఘట్టమూ పావనమే, అది మనకు పాఠమే! క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏసు ప్రభువు సువార్తలు ఆలకించి.. మనసుకు స్వస్థతను చేకూర్చుకుందాం.
ఒకసారి క్రీస్తు తన శిష్యులతో కలిసి ఓ గ్రామాన్ని సందర్శించాడు. సమయం మించిపోవడంతో శిష్యులు స్నానం చేయకుండానే భోజనానికి కూర్చున్నారు. ఆ రోజుల్లో యూదుల మతాచారం ప్రకారం.. భోజనానికి ముందు స్నానం చేయాలి. కనీసం శరీరంపై నీళ్లయినా చల్లుకోవాలి. వాటికి విరుద్ధంగా భోజనానికి ఉపక్రమించిన శిష్యులను చూసిన ఆనాటి మత పెద్దలకు అది రుచించలేదు. విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు క్రీస్తు వారితో.. ‘వెలుపలి నుంచి లోపలికి పోయి మనుషులను అపవిత్రులను చేసేది ఏదీ లేదు. కానీ, లోపల నుంచి బయటకు వెళ్లినవే మనుషులను అపవిత్రులను చేస్తాయి’ అన్నారు. ఇక్కడ ప్రభువు ఉద్దేశంలో లోపల నుంచి బయటకు వెళ్లేది.. నోటిలోంచి వెలువడే మాట! ఇది హృదయం నుంచి వస్తుంది. లోపల ఉన్న దురాలోచనలు, వైషమ్యాలు, క్రోధం, అహం వంటివి మాటలుగా బయటపడి అవి మనుషులను అపవిత్రం చేస్తాయి. ఫలితం పరస్పర వైషమ్యంతో మిత్రులు, శత్రువులుగా మారే ప్రమాదం ఉందని ప్రభువు ప్రవచనంలోని పరమసత్యం.
క్రీస్తును దర్శించడానికి వందలాదిగా భక్తులు వచ్చేవారు. కొందరు తమ వెంట పిల్లలనూ తీసుకువచ్చేవారు. కారణం.. ప్రభువు పిల్లలను చూసి తమను దగ్గరికి ఆహ్వానిస్తాడని, దీవిస్తాడని, కొన్ని మంచి మాటలు చెబుతాడని! అయితే ప్రభువు శిష్యులు.. పిల్లలను వెంట తెచ్చే తల్లిదండ్రులపై ఆగ్రహం ప్రకటించేవారు. ‘క్రీస్తు బోధనలు పిల్లలకు అర్థం కావు’ అంటూ కోపగించేవారు. దీంతో ఆ తల్లిదండ్రులు బాధతో వెనుదిరిగేవారు. శిష్యుల ప్రవర్తన ఒకసారి ప్రభువు కంటపడింది. వారిని కోపగించుకున్నారు. ‘పిల్లలను నా దగ్గరకు రాకుండా ఆటంకపరచవద్దు. వారిని ఆశీర్వదిస్తాను. పెద్దలను పరామర్శించినట్లే.. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహిస్తాను. ఆ చిన్నారులను ఆహ్వానించండి. ప్రేమ, నమ్మకం నిండుగా ఉన్నవాళ్లే.. దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. పిల్లల మాదిరిగా వినయశీలురై ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. నేర్చుకోవడానికి పిల్లల్లా కుతూహలం చూపాల’న్నారు ప్రభువు.
‘ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిదే! ఇతరుల సేవకు ముందు నడిచే వారే ప్రథములు’ అని క్రీస్తు ప్రబోధించిన ఈ లక్షణాలున్న వ్యక్తికి ఏ సమస్యా రాదు. హృదయంలో గర్వం కలిగిన వారు ధనికులైనా, ఉన్నత పదవుల్లో ఉన్నా.. వాళ్లు ఆధ్యాత్మికంగా పేదవారే! ఇహలోక సంపదలతో ఉన్నతస్థానంలో ఉన్నా.. ఆత్మీయ సంపదలో లేమిలో ఉంటే వారిని అధములుగా పరిగణించాలని క్రీస్తు బోధ. మనుషులు వారి సంపదలు, కీర్తిని బట్టి కాక.. సహజ గుణ విశేషాలను బట్టి గౌరవం పొందేవారే ధన్యులు అని చెబుతారు ఏసుక్రీస్తు.
– రెవ.డాక్టర్ కత్తి విక్టర్పాల్, కలకోట, తెలుగు బాప్టిస్టు చర్చి సెల్ : 9951243487