పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. నిష్ఠ, నిగ్రహాలతో ముస్లింలు రంజాన్ ఉపవాసాలకు శ్రీకారం చుట్టారు. అరబీ భాషలో ఉపవాసాన్ని ‘సౌమ్’ అంటారు. దీనికి ‘ఆగటం’, ‘ఊరుకోవటం’ అని అర్థాలు. తెల్లవారుజామున లేచి భుజించి సాయంత్రం వరకు సుమారు 14 గంటలపాటు ఆహార పానీయాలకు దూరంగా ఉండి కఠిన ఉపవాస దీక్షను పాటిస్తారు. ‘వ్యాధిగ్రస్తులు, బాలింతలు, ప్రయాణంలో ఉన్నవారు, వృద్ధులకు ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంద’ని ఖురాన్ పేర్కొన్నది.
తెల్లవారుజామున తినడాన్ని సహరీ అంటారు. సాయంత్రం ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు. సహరీ భుజించే వారిపై అల్లాహ్ శుభాశీస్సులు అందిస్తాడన్నది ముస్లింల నమ్మకం. ఖర్జూరపు పండుతో ఉపవాసాన్ని విరమించడం ప్రవక్త (సఅసం) సంప్రదాయం. అందుకే ముస్లింలు ఖర్జూరంతోనే ఉపవాసాన్ని విరమించేందుకు ఇష్టపడతారు.
‘ఏ వ్యక్తి అయితే రంజాన్లో ఒకరికి ఇఫ్తార్ చేయిస్తాడో దేవుడు అతని పాపాల్ని క్షమిస్తాడు, అతణ్ని నరకాగ్ని నుంచి రక్షిస్తాడు. ఇఫ్తార్ చేయించిన వ్యక్తికి, ఉపవాసం ఉన్న వ్యక్తికి సమానంగా పుణ్యం ప్రాప్తిస్తుంది’ అన్నది ప్రవక్త ఉద్బోధ. కేవలం ఆకలి దప్పులతో గడపడమే కాదు మనస్ఫూర్తిగా అన్ని రకాల చెడుగుణాలకు దూరంగా ఉంటేనే రోజా (ఉపవాసాల) ఆశయం నెరవేరుతుందని ప్రవక్త (స) హెచ్చరిక. కండ్లు, నాలుక, చెవులు, చేతులు, కాళ్లు ఇలా శరీరంలోని అవయవాలన్నీ ఉపవాసం పాటించాలన్నది ఖురాన్ స్ఫూర్తి.
‘మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే, ఆ రోజున వారు వ్యర్థమైన మాటలు మాట్లాడరాదు. గలాటా చేయరాదు. ఒకవేళ ఎవరైనా మనని దూషించినా, కయ్యానికి కాలుదువ్వినా వారితో -‘నేను ఉపవాసం ఉన్నానండి’ అని (మర్యాదగా) చెప్పాలి’ అని ఉపవాసాల ఆశయాన్ని ప్రవక్త (స) తెలియజేశారు. ఈ నెలలో మొదటి పది రోజులు ‘కారుణ్యం’, రెండో పది దినాలు ‘మన్నింపు’, చివరి పది రోజులు ‘నరకం నుంచి విముక్తి’ కలిగించేవిగా రంజాన్ మాసాన్ని ప్రత్యేకించారు.
…? ముహమ్మద్ ముజాహిద్, 9640622076