Teachers Day Special | మనిషి తన సమస్యలను ఎదుర్కొనేందుకు కావల్సినంత శక్తిని ఇచ్చింది ప్రకృతి. కానీ జీవితమనే రణరంగం ఒక్కోసారి అతడిని అయోమయానికి గురిచేస్తుంది. బీటలువారిన బంధాలు కలవరపెడతాయి. ఒత్తిడి కుంగదీస్తుంది. ఇలాంటప్పుడు ఓ మార్గదర్శి అవసరం ఏర్పడుతుంది. ఎవరో ఒకరు.. కష్టంలో ఓదార్పుగా, సందేహంలో జవాబుగా, సమస్యలో ధైర్యంగా నిలిస్తే బాగుండు అనిపిస్తుంది. భారతీయ జీవనవిధానంలో మొదటినుంచీ గురువులు ఆ పాత్ర పోషిస్తూ వచ్చారు. సద్గురువులు ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే పరిమితం కావడం లేదు. పరిపూర్ణ జీవితానికి అడ్డుగా నిలిచే ప్రతి సమస్య మీదా దృష్టి సారిస్తున్నారు. క్షేత్రమహిమల నుంచి సామాజిక సమస్యల వరకు.. అన్ని అంశాలనూ ఎంచుకుంటున్నారు. వైదిక విజ్ఞానాన్ని ఆధునిక జీవనశైలికి అన్వయిస్తున్నారు. లైవ్ టెలికాస్టింగ్ నుంచి ఇన్స్టా వరకూ ప్రతి మాధ్యమాన్నీ నియోగించుకుంటున్నారు. కొత్తకాలపు కొత్త గురువులకు ఇ-ప్రణామాలతో..
భారతీయ సమాజంలో… పురాణాల నుంచి మధ్యయుగాల చరిత్ర వరకూ ప్రతి మలుపులో, సందర్భంలో గురువుల పాత్ర కనిపిస్తుంది. ఇంటి నుంచి రాజ్యం వరకు.. గురువులు భాగంగానే ఉండేవారు. పారిశ్రామికీకరణ తర్వాతే ఆ పాత్ర మారింది. ఆధ్యాత్మికతను యాంత్రికమైన జీవితానికి అన్వయించాల్సిన సరికొత్త అవసరం వచ్చింది. అదే సమయంలో దేశాల మధ్య సరిహద్దులు కూడా చెరిగిపోతున్నాయి. దాంతో భారతీయుల పట్ల ఉన్న చిన్నచూపును తొలగించి, భారతీయ సమాజానికే ప్రత్యేకమైన తత్వచింతనను లోకానికి చాటాల్సిన సందర్భం వచ్చింది. ఈ సత్సంగాల కోసం మొదట్లో ఎంతో ప్రయాసకోర్చి ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు కాలం మారింది. ఎఫ్బీ రీల్, ఇన్స్టా ఫీడ్, యూట్యూబ్ వీడియో… ఇలా అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకుంటున్నారు. దీంతో ఇంటర్నెట్ ఓ పెద్ద గురుకులంగా అవతరించింది. మీట నొక్కితే చాలు.. అనుగ్రహ భాషణమే.
సద్గురు జగ్గీ వాసుదేవ్.. భారతీయ గురువులకు ఆధునిక రూపంగా కనిపిస్తారు. ఒకసారి తలపాగాతో, మరోసారి జీన్స్ ప్యాంటుతో… ఒకరోజు విమానాల్లో, మరోమారు బైక్ మీద సుదీర్ఘయాత్రతో దర్శనమిస్తారు.
వైవిధ్యమైన జీవనశైలిని ఎంచుకున్నా.. అంతస్సూత్రం మాత్రం ఆధ్యాత్మికతే. మైసూరులో జగదీశ్ వాసుదేవ్గా జన్మించిన సద్గురుది తెలుగు మూలాలున్న కుటుంబం. చదువు బాగానే సాగింది. కానీ మనసు వ్యాపారం వైపు మళ్లింది. కుటుంబానికి ఇష్టం లేకపోయినా వ్యాపారవేత్తగా మారారు. అక్కడా విజయం సాధించారు. పాతికేండ్లు వచ్చేసరికే ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. అవి తనను నిలువనీయలేదు. యోగా నేర్పుతూ… గమ్యం తెలియని ప్రయాణాలు మొదలుపెట్టారు. 1992లో మొదలైన ఈశా ఫౌండేషన్ ఉద్యమంగా మారింది. తను నమ్మినదాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో తప్పు లేదన్నది సద్గురు దృక్పథం. ఊరూరికీ కోకాకోలా చేరుకున్నప్పుడు, యోగా మాత్రం ఎందుకు చేరకూడదు అనేది ఆయన ప్రశ్న. ఇందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. యువత ఎక్కువగా ఇష్టపడే ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటారు. ఆ వేదిక మీదున్న కోటిమంది సభ్యులే ఇందుకు సాక్ష్యం. ఫేస్బుక్లోనూ ఆయన అనుచరుల సంఖ్య కోటికి చేరుకుంటున్నది. ఈ సామాజిక మాధ్యమాలన్నిటి ద్వారా ఆయన కోట్స్, ఉపన్యాసాలు అభిమానులకు అందిస్తుంటారు. ఇంగ్లిష్లో ప్రముఖంగా ఉన్నా.. తెలుగులాంటి భాషల్లో కూడా ఫేస్బుక్ అకౌంట్లు నిర్వహిస్తూ, ఆయన ఉపన్యాసాలను డబ్ చేసి మరీ అందిస్తున్నారు. ఇక ఆశ్రమంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలనూ లైవ్ ద్వారా ప్రసారం చేస్తుంటారు. వీటికి కూడా లక్షల వీక్షణలు ఉంటాయి. గత గురుపూర్ణిమ సందర్భంగా లైవ్ కార్యక్రమాన్ని లక్షన్నర మంది చూశారు. సద్గురు ఎప్పటికప్పుడు ర్యాలీ ఫర్ రివర్స్, సేవ్ సాయిల్… లాంటి ఉద్యమాలతో బిజీగా ఉంటారు. వాటికీ సామాజిక మాధ్యమాలే దన్ను. ప్రశ్న-జవాబుల వేదిక కోరా, కార్పొరేట్ ఉద్యోగులు ఇష్టపడే లింక్డ్ ఇన్ లాంటి వేదికల మీద కూడా ఆయనదే ప్రాబల్యం. ఒక్క ఫేస్బుక్లోనే #Sadhguru పేరుతో 8 లక్షల 45 వేల పోస్టులు ఉన్నాయంటే, ఈశా దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తమిళనాట పుట్టిన శ్రీశ్రీ రవిశంకర్… అటు భౌతిక శాస్త్రంలోనూ, ఇటు వైదిక విజ్ఞానంలోనూ పట్టు సాధించారు. భావాతీత ధ్యానం వైపు అడుగులు వేసి.. యోగిగా మారారు. శ్వాస మీద దృష్టి సారించే సుదర్శన క్రియకు శ్రీశ్రీ చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఆయనలో ఓ శాంతి కాముకుడూ ఉన్నారు. విశ్వశాంతి కోసం ఎన్నో సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. కశ్మీర్, సిరియా, కొసావా, అసోం.. ఎక్కడ ఘర్షణలు చెలరేగినా రాజీయత్నాల కోసం ముందుంటారు. అయోధ్య-రామ్మందిర్ లాంటి వివాదాల్లో.. ఇరుపక్షాలూ న్యాయస్థానం వెలుపల ఒక అంగీకారానికి వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. అవన్నీ సఫలమైనా, విఫలమైనా వార్తల్లో నిలిచారు. శ్రీశ్రీ నేతృత్వంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్వచ్ఛంద సేవలో కూడా ముందుంటున్నది. ఈ వేదిక ద్వారా మారుమూల ప్రదేశాల్లో 80 వేల మందికి పైగా పిల్లలకు విద్య అందించినట్టు చెబుతున్నారు. చెరువుల పునరుద్ధరణతో లక్షల మంది జీవితాలు మెరుగుపడ్డాయనీ, వేల మరుగుదొడ్లు నిర్మించామనీ, వందల గ్రామాలు విద్యుత్ వెలుగులు చూశాయనీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చెబుతున్నది. యువతకు ఉపాధిపరమైన నైపుణ్యాలు, రైతులకు సహజమైన వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ, ఆరోగ్య శిబిరాలు.. ఇలా చాలా ప్రయత్నాలే ఈ సంస్థ ద్వారా కనిపిస్తాయి. మిడిల్ ఈస్ట్, ఐరోపా, అమెరికా లాంటి ప్రదేశాల్లోనూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవల ప్రభావం ఉంది. ఇందులో సామాజిక మాధ్యమాలది కీలకమైన పాత్ర. ఎక్స్ (41 లక్షలు), ఇన్స్టా (20 లక్షలు), ఫేస్బుక్ (55 లక్షలు).. ఈ సంఖ్యలన్నీ ఆయన బోధల్ని గమనిస్తున్నవారివే. కోట్స్, రీల్స్, ఉపన్యాసాలు వీటన్నింటా పరుచుకుని ఉంటాయి. రవిశంకర్ ఉపన్యాసాలను సీరియస్గా అనుసరించే అభిమానులు ఎక్కువే. అందుకే యూట్యూబ్ మీద కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తుంది. 32 లక్షల మంది అనుచరులు ఉన్న తన చానల్కి 18 కోట్ల వీక్షణలు కనిపిస్తాయి. వీటి థంబ్నెయిల్స్ దగ్గర నుంచి ప్రజెంటేషన్ వరకూ ఆకట్టుకునేలా ఉంటాయి. Just Chill, What Happens When You Die లాంటి శీర్షికలు కనిపిస్తాయి. 21 Day Meditation Challenge లాంటి ఆన్లైన్ సిరీస్ ఆకర్షిస్తాయి.
కృష్ణ చైతన్య సంస్థ.. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలు మొదటి నుంచీ మీడియాకు కాస్త దూరంగా ఉండేవి. ఇందుకు భిన్నంగా గౌర్ గోపాల్ దాస్ ఆధ్యాత్మికతను, ఆధునిక జీవితానికి అన్వయిస్తూ చేసిన ఉపన్యాసాలు నేరుగా యువతలోకి వెళ్లిపోయాయి. హ్యూలెట్ పేకర్డ్ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఆయన సన్యాసాన్ని స్వీకరించారు. వైదిక విజ్ఞానం నుంచీ సైకాలజీ వరకూ విస్తారంగా అధ్యయనం చేసిన తర్వాతే ఆయన ప్రవచనాలు ఆరంభించారు. జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకు కాస్త హాస్యాన్నీ, కథలనీ జోడించి చెప్పడం దాస్జీ ప్రత్యేకత. ఇప్పటి తరం బంధాలలో, కెరీర్ పరుగులో భావోద్వేగాల నియంత్రణలో.. ఎదుర్కొంటున్న సమస్యల మీదే ఎక్కువగా తన ప్రవచనాలు సాగుతాయి. Lifes Amazing Secrets, The Way of the Monk లాంటి ఆయన పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్గా ఉన్నాయి. ఈ ప్రభావంలో సోషల్మీడియా పాత్ర అపరిమితం. ఇన్స్టాగ్రామ్లో ఆయనకు 70 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు, యూట్యూబ్లో దాదాపు అరకోటి సబ్స్ర్కైబర్స్ ఆయన్ను అనుసరిస్తున్నారు. ఏవో నాలుగు పోస్టులు చేయాలి అన్న తేలికపాటి భావనతో ఆయన సోషల్ మీడియా కనిపించదు. ఉదాహరణకు గోపాల్ దాస్ ఇన్స్టా.. ఇన్స్టాగ్రామ్ గ్రిడ్కు అనుగుణంగా ఆకర్షణీయంగా ఉంటుంది. యూట్యూబ్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వీడియోలు కనిపిస్తాయి. అందుకే కేవలం 350 వీడియోలు దాదాపు 60 కోట్ల వీక్షణలు పొందాయి. తనకంటూ ఓ ప్రత్యేకమైన వెబ్సైట్ ఉండటం మరో విశేషం. ఇందులో తన జీవనప్రయాణం మొదలుకొని రాబోయే కార్యక్రమాల వరకూ సమాచారమంతా కనిపిస్తుంది.
బ్రహ్మకుమారి సమాజం గురించి చాలామందికి తెలుసు. భారతీయ ఆలోచన నుంచి ఉద్భవించినా.. బ్రహ్మకుమారి సమాజం నమ్మకాలు కాస్త వైవిధ్యంగా ఉంటాయి. దైవం, కర్మ, పునర్జన్మ, ధ్యానం లాంటి విషయాల మీదే వీరు ఎక్కువగా మాట్లాడతారు. ఈ సంస్థ గురువుగా ప్రచారంలోకి వచ్చిన గురు శివానిది సాధారణ నేపథ్యమేమీ కాదు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్, కంప్యూటర్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేశారు. చిన్నప్పటి నుంచి బ్రహ్మకుమారి సమాజం పట్ల ఉన్న ఆసక్తితో ఆ ఉద్యమంలో చేరారు. తన ప్రయాణంలో మాధ్యమాల తోడ్పాటు కీలకం. ఓ రెండు దశాబ్దాల క్రితం, కేబుల్ టీవీలు ప్రచారం పొందుతున్న సమయంలో పూర్తిగా భక్తి కార్యక్రమాలనే ప్రసారం చేసే ‘ఆస్తా’్త అనే చానల్ మొదలైంది. అందులో Awakening with Brahma Kumaris పేరుతో శివాని చేసిన ప్రసంగాలు మంచి ఆదరణ పొందాయి. కమర్షియల్ కార్యక్రమాలు, సీరియల్స్ నుంచి కాస్త ఊరటనూ అందించాయి. క్రమంగా శివాని ప్రసంగాలకు ఆదరణ పెరిగింది. తన షో రెండువేల ఎపిసోడ్లను పూర్తిచేసుకుందంటేనే, అది ఎంత విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. డిప్రెషన్, ఆత్మన్యూనత, ఒత్తిడి, వ్యసనాలు, గొడవలు.. ఇలా సాధారణ జీవితాల్లో ఉండే ప్రతీ సమస్య మీదా శివాని మాట్లాడతారు. అందుకే, ఇన్స్టాలో తను పెట్టే కోట్స్ చూసేందుకు 13 లక్షలమంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇంగ్లిష్, హిందీల్లో పెట్టే ఒక్కో పోస్టుకు వేల లైక్స్ కనిపిస్తాయి. ‘వెలుతురు అవసరం లేకపోతే లైట్స్ ఆపేస్తాం. నీరు కారిపోతుంటే ట్యాప్ కట్టేస్తాం. ఇలా ఎక్కడికక్కడ ఎనర్జీని ఆదా చేసేందుకు ప్రయత్నిస్తాం. మరి మన శక్తిని ఎందుకు గతం మీదా, గాలిమాటల మీదా వెచ్చిస్తాం’.. ఇదిగో ఇలా గుండెకు ఛెళ్లుమని తాకే సూక్తులతో తన సామాజిక మాధ్యమాలు, యువతను ఆకట్టుకుంటాయి. ఇక శివాని యూట్యూబ్ చానల్కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన వీడియోస్ ఎక్కువగా హిందీలోనే ఉన్నప్పటికీ యూట్యూబ్లో ఏకంగా 79 కోట్ల వీక్షణలు కనిపిస్తాయి. ఇన్స్టా, ఎక్స్లోనూ పదిలక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.
మాతా అమృతానందమయి. ఓ పేద కుటుంబంలో పుట్టారు. బడుగు కులం. పెద్ద కుటుంబం. తన జీవితం వెళ్లమారితే చాలు అనిపించే ఆ పరిస్థితుల మధ్య… అనూహ్యంగా, లేనివారి కోసం తన దగ్గర ఉన్న కాస్త ఆహారం, బట్టలను ఇచ్చేసేవారు. కుటుంబం ఎంత మందలించినా తన పద్ధతి వీడలేదు. ప్రేమను పంచే తన తీరునే జీవితంగా మార్చుకున్నారు. ఇప్పటికీ అమృతానందమయి దర్శనం అంటే తన ఆలింగనమే. భజన, ధ్యానం, సేవ, క్షమాపణ.. లాంటి విషయాలకు ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సామాజిక సమస్యల మీద, అమృతానందమయికి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. మహిళల పట్ల వివక్ష నుంచి మనుషుల అక్రమరవాణా వరకు చాలా అంశాల మీద అంతర్జాతీయ వేదికల మీద కూడా గళమెత్తారు. ఆమె స్థాపించిన మాతా అమృతానందమయి మఠం Mothers Kitchen ద్వారా దేశవిదేశాల్లో అన్నదానం, వేలగ్రామాలకు తాగునీరు, పేదలకు ఇళ్లు, అనాథాశ్రమాలు లాంటివి నడుపుతున్నది. వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విద్యలో అంతర్జాతీయ ర్యాంకింగ్ ఉన్న అమృత యూనివర్సిటీ కూడా నడుస్తున్నాయి. జీవనశైలి గురించి, భౌతిక ప్రపంచం ఆమె మాట్లాడేది తక్కువే అయినా.. అన్ని వయసులు, వర్గాల ప్రజల్లో ఆదరణ బాగానే ఉంది. నిజానికి ఆమె నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు దేశవిదేశాల్లో ఎన్నో సోషల్ మీడియా అకౌంట్స్ నిర్వహిస్తున్నాయి. అమ్మ న్యూజిలాండ్, మాతా అమృతానందమయి మఠ్… ఇలా ఎన్నో పేజెస్ కనిపిస్తాయి. అమృతానందమయి అధికారిక అకౌంట్లకు కూడా మంచి ఆదరణ ఉంది. ఫేస్బుక్లో అమ్మకు కోటిన్నర మంది ఫాలోయర్స్ ఉన్నారు. యూట్యూబ్లో తన వీడియోలకు రెండు కోట్ల వీక్షణలు కనిపిస్తాయి. సామాజిక మాధ్యమాల కోసం ప్రత్యేకించి ఇచ్చిన భాషణలు, సందేశాలు లేవుకానీ… తన ప్రజాదరణకు కొనసాగింపుగా ఇవి కనిపిస్తాయి. ఏ గురువైనా… ప్రజలకు మరింత చేరువ కావాలంటే… తనకు ఆసక్తి ఉన్నా లేకపోయినా, సామాజిక మాధ్యమాలలో తన ఉనికి ఉండాల్సిందే అనేందుకు సాక్ష్యం అమృతానందమయి డిజిటల్ పుటలు.
‘మహాభారతం ద్రౌపది ప్రతీకారం వల్ల జరిగిందని చాలామంది అనుకుంటారు. నిజానికి అది ఓ కారణం మాత్రమే. దుర్యోధనుడి దృక్పథమే మూలకారణం. సానుకూల దృక్పథం ఎలాంటి పరిస్థితినైనా… అనుకూలంగా మార్చేస్తుంది.’ ఇది ఎవరో వ్యక్తిత్వ వికాస నిపుణుడు చెప్పిన మాట కాదు. జ్ఞానవత్సల్ స్వామి ప్రవచనం. అక్షర్ధామ్, స్వామినారాయణ్ సంస్థకు చెందిన ఈ గురువు మూలాలు గుజరాత్లో ఉన్నాయి. మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్లలో లక్షల మంది ఈయన ప్రవచనాలను అనుసరిస్తుంటారు. గుజరాతీ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ.. టెడ్ ఎక్స్ లాంటి వేదికల మీద సైతం ప్రసంగించారు స్వామీజీ. రోజును మూడు భాగాలుగా విభజించుకుని టైమ్ మేనేజెమెంట్ చేయడం ఎలా, వ్యాపారంలో విజయం సాధించడం ఎలా, కలలను నిజం చేసుకోవడం ఎలా… ఆయన ఎంచుకునే ఇతివృత్తాలు ఆసక్తికరం, సమకాలీనం. ఈ స్వామీజీ 7 Habits of Successful People లాంటి పుస్తకాలు చదవమని కూడా సూచిస్తుంటారు. స్వామీజీని నేరుగా కంటే, యూట్యూబ్ వీడియోల ఆధారంగా అనుసరించే భక్తులే ఎక్కువ. ఆయన వేదికల మీద చేసిన ప్రసంగాలను రికార్డ్ చేసే ‘బిజినెస్ గ్యాన్’ లాంటి యూట్యూబ్ చానల్స్ కోట్ల వ్యూస్ కూడగట్టుకుంటున్నాయి.
ఒకప్పుడు ప్రవచనం అంటే ఏ గుడి ఆవరణలోనో, పాఠశాల మైదానంలోనో జరిగేది. ఇప్పుడు, ఇంటర్నెట్ వేదిక మీదికి మారింది. అందులోనూ అచ్చమైన తెలుగులో, సుబోధకమైన భాషలో పురాణాల్ని పరిచయం చేస్తున్నారు చాగంటి. వీరు ఏకసంథాగ్రాహి అని చెబుతారు. అష్టాదశ పురాణాలు ఆయనకు కరతాలమలకం. జీవితపు మలిదశలో ప్రవచనాలు మొదలుపెట్టినా, చాలా త్వరగా పేరు తెచ్చుకున్నారు. ఆధునిక జీవితాల గురించి ప్రత్యేకంగా వ్యాఖ్య చేయకపోయినా… ప్రాచీన సాహిత్యంలో కనిపించే జీవనసూత్రాలు, విలువలు ఇప్పటి తరానికి నచ్చేలా చెప్పడంతో యువతలోనూ మంచి ఆదరణ సాధించారు. అందుకే ఆయన పేరు మీద సోషల్ మీడియా అకౌంట్లకు కొదవ లేదు. వాటిని అనుసరించేవారి సంఖ్య కూడా ఎక్కువే! చాగంటి గురువు గారి ఫాలోయర్స్ (866K), చాగంటి ప్రవచనాలు (866K)… ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆయన పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్కు దాదాపు రెండు కోట్ల వీక్షణలు ఉన్నాయి. విన్నవారికి విన్నంత!
గరికపాటి అనగానే తన అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా బద్దలుకొట్టేసే ఉపన్యాసకుడు గుర్తుకొస్తారు. ఆ అభిప్రాయాలు ఒక్కోసారి సంప్రదాయంగా వస్తున్న నమ్మకాలకు వ్యతిరేకంగా కూడా ఉంటాయి. అవధానాలతో మొదలైన తన ప్రయాణం, ఉపన్యాసాలతో ఆదరణ పొంది.. ప్రవచనకారుడిగా మారింది. పురాణాలతో పాటు.. పద్య, ప్రబంధ సాహిత్యాల మీద ఆయనకు అసాధారణమైన పట్టుంది. దాంతో తను చెప్పదల్చుకున్న విషయానికి హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ, విమర్శనూ జోడిస్తూ.. ఆశువుగా పద్యాలు చెబుతూ, ప్రాచీన సాహిత్యం నుంచి సాక్ష్యాలు ఉటంకించడంతో శ్రోతలకు సాధికారికంగా తోస్తుంది. ‘గరికపాటి’ అని టైప్ చేయగానే.. ఆలోచనలు ఆపడం ఎలా, భోజనం చేసేటప్పుడు అందరూ చేసే తప్పు… అంటూ కనిపించే రకరకాల థంబ్నెయిల్స్ చూస్తేనే ఇప్పటి తరం ఆయన్ని ఎందుకు వింటున్నదో అర్థమవుతుంది. వివిధ చానల్స్లో ఉపన్యాసాలతో పాటు… ఫేస్బుక్, యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయి. అఫీషియల్ ఫేస్బుక్ పేజీకి 16 లక్షల మంది ఫాలోయర్స్ ఉంటే, యూట్యూబ్కి ఏకంగా 17 లక్షల మంది సబ్స్ర్కైబర్లు ఉన్నారు.
సంప్రదాయ భక్తితత్వాన్ని ఇష్టపడేవారికి, అందునా విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి నచ్చే గురువు సామవేదం షణ్ముఖ శర్మ. శైవ, వైష్ణవ అన్న భేదం లేకుండా… పురాణాలను ఆకట్టుకునేలా చెబుతారు. భారత, భాగవతాల మీద అనర్గళంగా ఉపన్యసిస్తారు. క్షేత్ర మహిమలు వివరిస్తారు. భక్తుల కథలు చెప్పుకొస్తారు. భారతీయ కళలు, తెలుగువారి చరిత్రల గురించి చెబుతారు. ఉపాసన, ఆరాధన, ఆచారం గురించి క్లిష్టమైన సమాచారం అందిస్తారు. ఓ పత్రికలో పనిచేసిన అనుభవం ఋషిపీఠం అనే వారపత్రికను స్థాపించి విజయవంతంగా నడిపించేందుకు ఉపయోగపడింది. సాహిత్యం పట్ల ఆసక్తి, సంపాదకత్వంలో అనుభవం… మంచి రచనలు చేయడానికి సాయపడింది. ఆర్థికశాస్త్రంలో డిగ్రీ… ఎలాంటి నేపథ్యం లేకపోయినా వ్యవస్థగా నిలబడేందుకు దోహదపడింది. ఇందుకు సామాజిక మాధ్యమాలు తగిన బలాన్ని అందించాయి. సనాతన ధర్మం, పురాణాల గురించి ఆయన చేసిన ప్రసంగాలకు యూట్యూబ్లో మూడు కోట్లకు పైగా వీక్షణలు దక్కాయి.
గ్లోబలైజేషన్ తర్వాత.. డబ్బుకు కొదవలేకపోయింది. సౌకర్యాలకు అంతులేకపోయింది. కానీ మనసులో మాత్రం తెలియని ఉక్కపోత. బంధాలు పలుచబడ్డాయి, ప్రశాంతత కరువైంది. ఈ పరిస్థితుల నుంచి ఊరట కోసం ఆధ్యాత్మికత వైపు ఆశగా చూసే ప్రజలకు ఎదురుగా.. స్వామి సుఖబోధానంద కనిపిస్తారు. స్వామీజీ గీత, ఉపనిషత్తులను.. ఆధునిక జీవనశైలికి అన్వయిస్తారు. ఒత్తిడిని తట్టుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వం లాంటి విషయాల మీద కార్పొరేట్ సంస్థలకు శిక్షణ ఇస్తారు. అందుకనే ఆయనకు కార్పొరేట్ గురు అన్న పేరొచ్చింది. ఆయన ప్రవచనాలు యువతను, కార్పొరేట్ రంగాన్ని బాగా ఆకర్షించాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఐపీఎల్ టీమ్కు సుఖబోధానంద స్పోర్ట్స్ సైకాలజీ కోచ్గా వ్యవహరించారు. ‘అద్దం తన ప్రతిబింబాలకు అంటిపెట్టుకుని ఉండనట్టే.. కలిసిన ప్రతి మనిషినీ పట్టుకుని వేలాడకు’, ‘మార్పు సమస్య కాదు, మార్పును నిరోధించడమే సమస్య’ లాంటి కోట్స్ ఆయన పట్ల ఆదరణ పెంచాయి. టీవీల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలయ్యాక, వాటిని ప్రచారానికి సమర్థంగా వినియోగించుకున్న గురువుల్లో సుఖబోధానంద ఒకరు. ఈ బోధల ఆధారంగా రాసిన ‘మనసా రిలాక్స్ ప్లీజ్’ పుస్తకం ఓ సంచలనం. సుఖబోధానంద తరచూ ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తారు. వాట్సాప్ బూట్క్యాంపులు లాంటి వినూత్నమైన ప్రయోగాలు చేస్తుంటారు. వీటిని ప్రచారం చేయడంలో సామాజిక మాధ్యమాలదే ముఖ్యపాత్ర. తన పేరు మీద, తన ప్రసన్న ట్రస్ట్ పేరు మీద ఈ అకౌంట్స్ విస్తృతంగా కనిపిస్తాయి.
..ఇవీ కొందరు గురువుల నేపథ్యాలు, గురుపాదాల డిజిటల్ ఫుట్ ప్రింట్! ఈ జాబితా అసంపూర్ణమే కాదు, అసమగ్రం కూడా. మనకు వ్యక్తిగతంగా పరిచయమైన ఓ గురువు కూడా వీరందరికంటే విజ్ఞానవంతుడిగా, ఉన్నతుడిగా కనిపించవచ్చు. వీరిలో ఎవరైనా వివాదంలో చిక్కుకున్నా, నోరు జారినా వారి మీద గౌరవం సడలిపోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే కోట్ల మంది ప్రజల మనసుల్లో వారి పట్ల అపారమైన గౌరవం ఉన్నమాట వాస్తవం. మన రోజువారీ సవాళ్లు, ఒత్తిడులు, చికాకులు, బాధలు, భయాల మధ్య వీరి మాటలు కొంత ఊరటనిస్తున్న మాట నిజం. అందుకు సామాజిక మాధ్యమాలు ఇతోధికంగా సాయపడటం గుర్తించి తీరాల్సిన విషయం!