‘జోజో కమలదళేక్షణ..,
పలు తోయంబుల జగముల..,
లోకములు నిదురవోవగ…’
సుందర అధ్యాత్మ గంధ బంధురములైన ఈ మూడు కంద పద్య అరవిందాలు తెనిగింతలు- అనువాదాలు కాక పోతన మహాకవి సొంతాలు! వేదమంత్రాలనే గోపికలు, వేదవేద్యుడైన సచ్చిదానంద శ్రీకృష్ణ పరబ్రహ్మను, చిదాకాశమనే నంద గృహంలో, అంతఃకరణ చతుష్టయ (మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు) మనే నాలుగు కోళ్లు, సత్త రజః తమములనే త్రిగుణాలతోపాటు త్రిగుణాల సమస్థితి- సామ్యావస్థ అనే నాలుగు తాళ్లు (గొలుసులు) కలిగిన ‘జ్ఞానం’ (తెలివి) అనే డోలిక- ఊయలలో పరుండబెట్టి- ‘జో అచ్యుతానంద! జోజో ముకుందా! లాలి పరమానంద! కృష్ణ! గోవిందా! జోజో..’ అని జోలపాటలు ఆలపిస్తూ ఊపారు. గోవిందునికి ముఖ స్వరూపమైన దశమ స్కంధంలో మునుముందు అందమైన ఇలాంటి కంద పద్యాలెన్నో చెన్నొందు (వెలుగొందు)తాయి!
యోగిరాజు శుకుడు రాజయోగి పరీక్షిత్తుతో…
సీ॥ ‘ఏ బాము లెరుఁగక యేపారు మేటికిఁ,
పసుల కాపరి ఇంట బాము గలిగె
నే కర్మములు లేక యెనయు నెక్కటికిని
జాతకర్మంబులు సంభవించె,
నే తల్లి చనుఁబాలు నెరుగని ప్రోడ
యశోద చన్నుల పాల చొరవ నెరిఁగె
నే హాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు
పొదిగిటిలో వృద్ధిఁబొందఁ జొచ్చె’
ఆ॥ ‘నే తపములనైన నెలమి బండని పంట
వల్లవీ జనముల వాడఁబండె
నే చదువులనైన నిట్టిట్టి దనరాని
యర్థ మవయవముల నందమొందె’
Chintana | రాజా! ఎప్పటికీ ఎట్టి పుట్టుకలూ లేకుండా ఏపారు (అతిశయించు, విజృంభించు) మేటికి- దిట్టకు పసుల కాపరి (నందుని) ఇంట పట్టి (కొడుకు)గా పుట్టడమనే ఇక్కట్టు (కష్టం) కలిగింది. వైదిక, లౌకిక- వ్యావహారికాలైన అన్ని కర్మలకు అతీతుడై, తానొక్కడే వెలుగు జలజాతనేత్రుడు- పద్మాక్షుడు వెన్నుడు- విష్ణువు జాతకర్మలు జరిపించుకొన్నాడు. జగత్తుకు తల్లి, తండ్రి, తాత, ముత్తాత అన్నీ తానే కాన ఏ తల్లిపాలు ఎరుగని ఆ గడుసరి సతీమతల్లి యశోదమ్మ చనుబాల రుచి మరిగి కొసరి కొసరి అడిగి మరీ తాగుతున్నాడు. హాని వృద్ధులు (పెరుగుట, తరుగుట) లేని పరబ్రహ్మం ఈనాడు పూనికతో మానిని యశోద ఒడిలో వడివడిగా ఎదగసాగాడు. ఎన్ని తపస్సులు చేసినా పండని, సింగారాలతో రంగారు (అలరు) బంగారుపంట నేడు మంద (గోకులం)లో నందుని ఇంట కన్నుల కరువు తీర పండింది. వేదశాస్ర్తాది ఎంతలేసి విద్యలు నేర్చినా ఇదమిత్థమని- ఇట్టిట్టిదని సుంతైనా తెలియరాని- అంతుపట్టని ఆ పరమార్థం అవయవాల పొందికతో అందమైన శిశురూపం ధరించి మందలోని భాగ్యవంతులందరిచే ఆనందంగా పొందబడుతోంది!
నందుడు మథురకు వెళ్లి కంసరాజుకు ఏటేటా కట్టవలసిన కప్పం చెల్లించి, మర్యాద పూర్వకంగా వసుదేవుని దర్శించాడు. నంద దర్శనంతో వసుదేవుని హృదయారవిందం వికసించింది. ప్రాణాలు లేచి వచ్చాయి. తన నందనుని (పసివాని)పై అమంద- ఎనలేని ప్రేమ ఉప్పొంగగా నందునితో… ‘సంగడీ (మిత్రమా)! సంతతి లేదని తీరని చింతతో చితికిపోయిన నీకు ఈనాటికి సంతతి కలిగినందుకు మాకు ఎంతో సంతసమయింది. ‘సంతతి హీనునికి సౌఖ్యసంతతి గలదే?’- నిజానికి సంతతి లేనివానికి సౌఖ్య సంతతి- సుఖ పరంపరలు ఉండవు కదా! నందా! మీ దంపతులు ఎంతో ప్రేమగా సాకుతుండగా, నిన్ను తండ్రిగా భావించు నా కుమారుడు ఆనందంగా ఉన్నాడా?’- ‘నా కొడుకున్నాడె నంద నందాన్వితుడై’ అని అడిగాడు. ‘మీ వద్ద తనయుడై తనరారు (పెరుగుచున్న) బాలుడు- మారజనకుడు విష్ణువు నా కుమారుడే!’ అని చక్కని ధ్వని! ఇది మన పోతన కవన (కవితా) నిర్మాణ చేతనా చాతురి- నేర్పు! ఈ ప్రశ్న బలరాముని గురించి కదా అని నందుడు భావించాడు.
కృష్ణుడు దేవకీ నందనుడని తెలియనందున నందుడు.. ‘వసుదేవా! నీ కుమారులందరినీ కంసుడు పుట్టిన వెంటనే తుదముట్టించాడు గదా! ‘నా సూనుండు నీ సూనుడే’- నా కొడుకునే నీ కొడుకనుకొని ఊరడిల్లు’ అని సానుభూతి కనబరిచాడు. వసుదేవుడు.. ‘నందా! సానందమైన- ఆనందమయంగా ఉన్న మందలో నందనునికి- బాలగోవిందునికి, ఆపద సంభవించే సూచనలు నా స్వాంతంలో (మనసులో) పొడసూపుతున్నాయి. ముందు జాగ్రత్తగా నువ్వు వెంటనే నెలవుకు- నివాస స్థానానికి బయల్దేరు అంటూ సెలవు ఇచ్చి పంపించాడు. వసుదేవుని మాట వర్తమాన కాల వాచకం. అనగా మథురలో ఈ వార్తాలాపం- సంభాషణ జరుగుతుండగానే కంసుని పంపున బాలఘాతిని- పసిపిల్లల పచ్చి నెత్తురును కచ్చెతో తాగే పూతన గోకులానికి వచ్చింది. మంచి మనసున్న వసుదేవునికి భవిష్యత్తు వర్తమానంగా గోచరించింది. వసుదేవుని వంటి సత్యనిష్ఠునికి సుష్ఠుగా వాక్సిద్ధి కలుగుతుందని సూచన!
మాయావిని పూతన ఆకాశమార్గంలో గోకులానికి వచ్చి, నందుని ఇంట్లో బాలుని నాదం- కేరింతలు, రోదనం విన్నది. ప్రమోద భరితయై కామరూపిణి కాన, ఆ లేమ చాలా అందమైన భామ రూపం పొంది లీలా బాలుని మందిరంలోకి ప్రవేశించింది. ఆ సుందరి లోపలికి వస్తుంటే ‘మనలను అందరినీ బతికించడానికి ఇంత అందమైన వేషంతో సాక్షాత్ ఇందిరాదేవే మన మందిరానికి వచ్చినట్టుంది!’ అని మోహంలోపడి మాటలుడిగి మైకం కమ్మి నిలబడిపోయారు గోపికలు. మాయా శిశురూపంలో మంచం మీద పరుండిన విరించి (బ్రహ్మ) జనకుని, సర్వజీవ చేతనా స్వరూపుని, పరాత్పరుని చూచింది పూతన. ఆ నిప్పు నివురుగప్పి ఉండటం వలన తాకితే ముప్పు తప్పదని, ఆ డింభకుడు (శిశువు) దుష్టజన సంహార ప్రారంభకుడని ఆమె గ్రహించలేకపోయింది.
బాలెంతరాలి వేషంలో పాలిండ్లలో విషం ధరించి వస్తున్న ఆ బాల హంతకురాలిని లీలాగోపాల బాలుడు చూచి లోలోపల నవ్వుకొని నిద్రిస్తున్నట్లు కళ్లు మూసుకొని గుర్రుపెట్టసాగాడు. రోహిణి యశోదాది వారిజాక్షులు ఎంత అవ్వారి (గట్టి)గా వారిస్తున్నా ఆ వాలుగంటి (విశాలాక్షి) పూతన వారి మాటలు పట్టించుకోలేదు. ఆ పిల్లవానిని తన చేతులతో లేవనెత్తి పాలిండ్లకు హత్తుకుంది. నిద్రిస్తున్న పామును తాడుగా భ్రమించి చేతితో ఆడుకొన చూసే పాడు బుద్ధివాని (మార్ఖుని)వలె బాలుని తొడలపై పెట్టుకొని, ఒడలు (ఒళ్లు) నిమురుతూ, వాత్సల్యం నటిస్తూ ‘పాలు తాగు నాన్నా!’ అంటూ చిన్ని కన్నయ్యగా ఉన్న వెన్నునికి- విష్ణువుకి చన్నిచ్చింది…
కం॥ ‘నా చనుబాలొక గ్రుక్కెఁడు
నోచిన్ని కుమార! త్రావు మొయ్యన పిదపన్
నీ చెలువ మెరుఁగ వచ్చును
నా చెలువము సఫలమగును నళినదళాక్షా!’
‘కమలాల వంటి కన్నులు గల చిన్నికన్నా! నా చన్నుపాలు తిన్నగా ఒక్క గుక్కెడు తాగిచూడు. అప్పుడు నీ అందమెలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పటి నా అందం కూడా అందలమెక్కుతుంది’ అని అన్నది. ‘నా క్షీరం తాగి నువ్వు క్షేమంగా ఉంటావు. నా జన్మ కూడా సార్థకమవుతుంది’ అని గూఢార్థం!
శుకుడు- రాజా! కృష్ణుడు మెల్లగా కళ్లు తెరచి, ఒళ్లు విరిచి, ఆవులించి ఎంతో ఆకలిగా ఉన్నట్టు చన్నులను గట్టిగా పట్టి నోట పెట్టుకున్నాడు. గుటుకు గుటుకు మంటూ రెండు గ్రుక్కల్లో దాని మేని సత్తువంతా లాగేసి ఇందిరాజాని-విష్ణువు, కాలకూటకు పాలతోపాటు లోని ప్రాణాలు కూడా తాగేశాడు. గుండెలు తల్లడిల్లగా పూతన నిలువలేక తల వాల్చేసింది. ‘అమ్మో! నీవు ఇతర బాలురవంటి వాడవు కావు. బిడ్డా! చాలు చాలు. ఇక పాలు తొగొద్దు’ అంటూ కాలు చేతులు వంకరలు తిరగగా, కళ్లగ్రుడ్లు వెల్లుకు రాగా గోల చేస్తూ పర్వతాకారం- భయంకర రూపంతో నేల కూలి ప్రాణాలు కోల్పోయింది. ‘నీవు గోపాలుడవు కదా! నీ వద్ద పాలు పెరుగులకు ఏ లోపాలూ ఉండవని నిన్ను ఆశ్రయిస్తే, నా పాలి దైవమా! హే కృపావిశాలా! నా పాపాలను హరించుటే కాక, పనిలోపనిగా నాకిక తల్లిపాలు తాగేపని (జన్మ) కూడా లేకుండా చేశావు కదా హరీ!’ అని అని వివరించారు లీలాశుక ముని!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006