కాలగణన గణితానికీ అంతుబట్టదు. లిప్తపాటులో జరిగిపోయే కాలానికి కళ్లెం వేయడం బ్రహ్మతరం కూడా కాదు. కాలం ఆధారంగా జీవనయానం చేసే మనుషుల కోసం మన రుషులు ఎంతో శోధించారు. కాలాన్ని గణించి.. కాలానుగుణంగా రుతువులుగా విభజించి ప్రకృతి ధర్మాన్ని అర్థం చేశారు. ఉత్తర, దక్షిణాయనాలుగా విడదీసి ఏ అయనంలో ఎటుగా పయనించాలో నిర్దేశించారు. ఇప్పుడు దక్షిణాయనానికి వేళ అయింది. ప్రకృతి విలక్షణంగా మారిపోయింది. ఉత్తరాయణం ముక్తికి మార్గమైతే.. ఆ దారికి చేరుకునే శక్తిని ప్రసాదించే పవిత్ర కాలం దక్షిణాయనం. ఈ పుణ్యకాలాన్ని ఆధ్యాత్మిక ప్రయాణానికి వినియోగించుకోవాలి.
సూర్యుడు ప్రతీనెలలో ఒకరాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. సూర్యగమనాన్ని బట్టి భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమనీ, దక్షిణ దిశలో సంచరిస్తే దక్షిణాయనంగా ఖగోళశాస్త్రం చెబుతున్నది. సూర్యుడి గమనంలో వచ్చే మార్పులే ఉత్తర, దక్షిణాయనాలు. ఏడాదిలో ఆరునెలల చొప్పున ఈ రెండు అయనాలు ఉంటాయి. జనవరిలో వచ్చే మకర సంక్రమణం నుంచి ఉత్తరాయనమనీ, జూలైలో వచ్చే కర్కాటక సంక్రమణం నుంచి దక్షిణాయనమని వ్యవహరిస్తారు. ఈ రెండు అయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది. ఆధ్యాత్మికపరంగా దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగానూ చెప్తారు. సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి మకరరాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే కాలమైన దక్షిణాయనం ఆధ్యాత్మికంగా ముఖ్యమైన సమయం కాగా ఈ సంవత్సరం జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది.
ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమంటారు. దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణుసహస్రనామ పారాయణం చేయడంతో పాటు శ్రీవరాహస్వామివారిని పూజించడం శ్రేష్ఠమని మహర్షులు చెప్పారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. తొలి ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు నాలుగునెలల పాటు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి తోడ్పాటు అవసరం కాబట్టి దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు, యజ్ఞాలు, జపాలు, అభిషేకాలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసనాకాలం.
యోగులు, మఠాధిపతులు, పీఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు. దక్షిణాయనం ఆరంభంలో తొలి ఏకాదశితో తెలుగువారి పండుగలు మొదలవుతాయి. ఆషాఢంలో బోనాలు ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వరలక్ష్మీవ్రతం,రాఖీ పౌర్ణమి, వినాయకచవితి, పితృకర్మలకు సంబంధించిన మహాలయపక్షాలు, మహాలయ అమావాస్య, పూల సంబురమైన బతుకమ్మ, విజయదశమి, దీపావళి, హరిహరులకు ప్రీతికరమైన కార్తిక, మార్గశిర మాసాలు, వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా జరిగే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. సంక్రాంతి తర్వాత మకరరాశిలోకి సూర్యసంక్రమణం నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. శుభకార్యాలను ఉత్తరాయణంలో నిర్వహించడం ఆనవాయితీ కాగా శక్తి ఆరాధన, రుద్రోపాసన, పితృదేవతారాధనలను దక్షిణాయనంలో చేస్తారు.
శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమిమీద తక్కువగా ప్రసరిస్తుంది. దీంతో జీవరాశులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాలు ప్రబలుతాయి. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో ఉపాసన మార్గం శ్రేష్ఠమని శాస్ర్తాలు చెప్పాయి. ఉపవాసాలు, పూజలు, దీక్షలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు ఈ సమయంలోనే ఉండటంతో రోగనిరోధకశక్తి పెరిగి, ఆరోగ్యం కలుగుతుంది. ధ్యానం, జపం, నియమం.. ఇవి మూడూ దక్షిణాయనంలో ప్రధానమైనవి కాగా వీటితో మానవాళి రోగ విముక్తులవుతారని వేదాలు చెప్పాయి. అదే విధంగా మహాలయ పక్షాలలో పితృదేవతలను సంతృప్తి పరిస్తే సంతానాభివృద్ధి జరుగుతుందని పండితులు చెప్తారు.
– శ్వేత