శ్రీశైలం: జ్యోతిర్లింగక్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు రాగా.. శనివారం సైతం ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధాన ఆలయాల్లో భ్రమరాంబ మల్లికార్జునస్వామివారలతో పాటు పరివార దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. రేపు ఆదివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీవల్లి హైదరాబాద్ బృందం సిద్ధి వినాయక స్వాగతం, శంకరశ్రీగిరి, శ్రీశైలవాస, నమశ్శివాయతే, ఆనందతాండవం తదితర నృత్య ప్రదర్శనలు అలరించాయి. హైదరాబాద్కు చెందిన దీక్షిత్ అకాడమీ డాన్స్ మూషికవాహన, శివాష్టకం, భో శంభో.. గిరిజా కల్యాణం, పుష్పాంజలి, గరుడ గమన, శివతాండ స్తోత్రం, బ్రహ్మమురారి తదితర గీతాలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
అలాగే హరికథ, బుర్రకథ, భక్తిరంజని తదితర కార్యక్రమాలు శ్రోతలను అలరించాయి. ఇదిలా ఉండగా.. స్వామివారికి రూ.1.28లక్షల విలువైన 54 పంచముఖాలతో కూడిన రుద్రాక్ష మాలను పర్వతయ్య, శరదాదేవి కానుకగా అందించారు. పీఆర్ఓ శ్రీనివాసరావు, ఏఈఓ హరిదాస్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఉన్నారు.