దైవదర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించే సమయానికే మనకు మంత్రాలు వినిపిస్తుంటాయి. ఆలయంలోని ప్రధాన దైవానికి సంబంధించిన మంత్రం.. ఆ ప్రాంగణంలో లీలగా మార్మోగుతూఉంటుంది. ఓంకారం మొదలైన మంత్రాలను వినటంతోనే మన మనసుకు ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. మంత్రం వినగానే ఒక్కసారిగా మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదో మార్పు కలిగినట్లు అనిపిస్తుంది. ఓవిధమైన ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక భావాలు ఉప్పొంగుతాయి. ఇవన్నీ జరగటానికి కారణం మంత్రాలకు ఉన్న మహత్తరమైన శక్తి.
ఆలయంలోని అర్చకస్వాములు చదివే మంత్రాల్లో మహత్తరమైన శక్తి ఉంటుంది. అవి కేవలం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటానికి చేసే స్తోత్రాలు మాత్రమే కాదు. మనలో నిద్రాణమై ఉన్న ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేసే చైతన్యదీపాలు. మంత్రంలోని ప్రతి అక్షరం వెనుకా మాటల్లో వర్ణించలేనంత గొప్ప శక్తి దాగి ఉంటుంది. భక్తుడు నిరంతర సాధన ద్వారా ఈ శక్తిని పొందగలుగుతాడు.
‘మంత్రం’ అనే పదానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి. పద వ్యుత్పత్తి ప్రకారం పరిశీలిస్తే, ‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ – నిరంతరం మననం చేసే వారిని రక్షించేది మంత్రం అని అర్థం. మరొక కోణంలో పరిశీలిస్తే, మంత్రం అనే పదంలో ‘మ’ అంటే మననం చెయ్యటం. ‘త్రం’ అంటే ‘త్రాణం’ (రక్షించేది అని అర్థం). అదేపనిగా, మంత్రాన్ని నిశ్చలమైన భక్తితో ఉపాసన చేసినట్లయితే, ఆ మంత్రశక్తి మరింతగా పెరుగుతుంది. మంత్రానికి అధిష్ఠాన దేవత అనుగ్రహం కలుగుతుంది. అందుకే మననం చేసేవారిని రక్షించేది మంత్రం అయింది.
మంత్రం శబ్దరూపంలో ఉండే దైవం. మంత్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ మంత్రశక్తి భక్తుడు/ సాధకుడి అణువణువులో వ్యాపిస్తుంది. మంత్ర జపం చెయ్యటానికి ముందు, ఆ వ్యక్తిలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. భక్తుడిలో అంతర్గతంగా ఉన్న దైవీకమైన శక్తులు జాగృతమవుతాయి. జ్ఞానోదయం అవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య మాలిన్యాలు తొలగిపోతాయి. మనసు నిశ్చలమై, సచ్చిదానంద స్థితి కలుగుతుంది.
అత్యంత శక్తిమంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి, శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలో స్పందన ఉంటుంది. మంత్రాన్ని సక్రమంగా ఉచ్చరించినట్లయితే, ఆ మంత్రంలో ఉన్న బీజాక్షరాల్లో స్పందన కలిగి, అత్యద్భుతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. మంత్రాల నుంచి ఉత్పన్నమయ్యే శబ్దతరంగాలు అమోఘమైన శక్తి కలిగి ఉంటాయి. ఇవి జీవుల మీదా, ప్రకృతి మీదా, సృష్టి మీదా స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విషయాన్ని పలు అధునాతన శాస్త్ర పరిశోధనలు కూడా ఒప్పుకొన్నాయి.
జీవుల్లో ఉండే అంతరంగిక శక్తులతోపాటు ప్రకృతిలో ఉండే అదృశ్య శక్తుల్ని కూడా మంత్రాల్లో ఉండే బీజాక్షరాలు ప్రేరేపిస్తాయి. వర్షాలు కురిపించడం, దీపాలు వెలిగించడం మొదలైన వాటిని శబ్దతరంగాల ప్రక్రియతో మన పూర్వికులు సాధించి చూపించారు. అణువులను కదిలించే శక్తి శబ్ద తరంగాలకు ఉండడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే ప్రతి అక్షరం బీజాక్షరం. ప్రతి
బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం.
తదేక లక్ష్యంలో మంత్రాన్ని ఉపాసన చేసినట్లయితే భక్తుడు చేస్తున్న సాధన ఫలిస్తుంది. అయితే, కేవలం నోటిమాటగా భక్తుడు మంత్రాన్ని పలకటం వల్ల ఫలితాలు కలగవు. మానసిక ఏకాగ్రతతో, త్రికరణ శుద్ధిగా మంత్రం జపం చెయ్యాలి. తాను నమ్ముకున్న దైవం పట్ల, ఎంచుకున్న మంత్రం పట్ల, మంత్రోపాసన చేసిన గురువు గారి (కేవలం గురువు గారి నుంచే మంత్రోపదేశం పొందాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ పుస్తకాలను చూసి మంత్రసాధన చెయ్యకూడదు. ఇది విపరీతమైన ఫలితాలను ఇస్తుంది) పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలి. అప్పుడే మంత్రం ఫలిస్తుంది. మంత్రశక్తి మనం కోరుకున్న ఫలితాలను అందిస్తుంది.
– డాక్టర్ కప్పగంతు రామకృష్ణ