శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించినటుల్ దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి మంగళవారం ఉదయం షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహించారు. సాయంకాలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఆరుబయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన తీర్ధప్రసాదాలు అందించారు.
అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగల బసవన్నకు ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించి.. పంచామృతాలు ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. నూతన వస్త్రాన్ని సమర్పించి, నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అర్చక వేదపండితులు బిల్వమాలతో సత్కరించి, పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ప్రాకార మండపంలో వేదపండితులు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు.