వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో కర్షకులకు వర్షాలు బాగా కురిస్తే ఆనందం. దేశంలో పంటలు బాగా పండాలంటే జూన్ నుంచి సెప్టెంబర్ నెలల్లో కురిసే నైరుతి రుతుపవనాలే ప్రధాన ఆధారం. జూన్లో తొలివానలు మొదలుకాగానే అప్పటివరకు గ్రీష్మ తాపానికి నెర్రెలిచ్చిన నేల వాననీళ్లు తాగి దాహం తీర్చుకుంటుంది. మట్టి పరిమళాలను వెదజల్లుతుంది. మోడువారిన చెట్లు పచ్చదనం పులుముకుంటాయి. చెరువులు, దొరువులు, మడుగులలోకి కొత్తనీరు చేరడంతో అప్పటివరకు దీర్ఘసుషుప్తిలో ఉన్న కప్పలు పునరుజ్జీవం, పునరుత్తేజం పొందుతాయి. తమ జతల కోసం భీకరంగా బెకబెకలు మొదలుపెడతాయి. ఇదీ రుతుపవనాల ఆరంభ దినాలలో భారతదేశంలో నెలకొనే వాతావరణం.
ఈ వాతావరణం నుంచే సుమారు నాలుగు వేల ఏండ్ల కింద భారత ఉపఖండం వాయవ్య భాగం సప్తసింధు ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకున్న ఆర్యగణాలు స్ఫూర్తిపొంది ఉంటాయి. సంవత్సరంలో నిర్ణీత కాలంలోనే వర్షాలు పడటం, అప్పటివరకు దేహాలను శుష్కింపజేసుకుని, దీర్ఘనిద్రలోకి వెళ్లిపోయిన కప్పలు తొలకరిలో వర్షపు నీరు తమ శరీరాలను తాకగానే పునరుజ్జీవం పొందడం, కప్పలు తోడు కోసం బెకబెకలు మొదలుపెట్టడం రుగ్వేద కాలపు రుషుల గళం నుంచి వేదనాదం ఉప్పొంగేలా చేశాయి. అలా కప్పలను ప్రధానంగా చేసుకొని గానం చేసిందే రుగ్వేదంలోని ‘మండూక సూక్తం’. “సంవత్సరం శశయానా బ్రాహ్మణా వ్రతచారిణాః/ నాచం పర్జన్య జన్వితం ప్ర మండూక అవారిషు”… ఏడాదిపాటు మౌనవ్రతం పట్టి, తమ కోరికలు తీరడానికి మంత్రాలు చదువుతున్న రుత్వికులలా, మేఘుడు శరీరాలను తడపగానే కప్పలు తమ గొంతు విప్పాయి అంటుంది ‘మండూక సూక్తం’. అంతేకాదు ఆ భేకాల అరుపు తమ లేగలతో కలిసి ఆవులు చేసే అంభారావాల్లా ఉంటుందట. ఇంకా నీళ్ల కోసం ఎదురుచూసి, దప్పికగొన్న ఆ కప్పల అరుపులు కొడుకు కేరింతలు కొడుతూ తండ్రి దగ్గరికి పరుగెడుతున్నట్లుగా ఉన్నదట. వానలో తడిసిన కప్పలు ఆకుపచ్చది, మచ్చలది రెండూ ఒకేసారి తమ గళమెత్తాయి. అలా ఒకటి మరొకదాని అరుపును పునరావృతం చేస్తుంటే గురువు దగ్గర పాఠాలు వల్లెవేస్తున్న శిష్యుడిని తలపిస్తున్నదట. ఒక కప్ప ఆవులా రంకె వేస్తుంది. మరొకటి మేకలా అరుస్తుంది. వీటిలో ఒకటి ఆకుపచ్చది, మరొకటి మచ్చలది. రెండూ కప్పలే అయినా అవి వేర్వేరు. వాటి గొంతులు కూడా వేర్వేరే. అతిరాత్ర యాగంలో సోమయజ్ఞం దగ్గర సోమపాత్ర చుట్టూ చేరి బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ కూర్చున్నట్లే, తొలకరిని అనుభవించడానికి కప్పలన్నీ కూడా కొలను చుట్టూ చేరి అరుస్తున్నాయట. కప్పలు భగవంతుడు నిర్ణయించిన పన్నెండు నెలల క్రమాన్ని రక్షిస్తాయి. ఎండాకాలం పూర్తయి వానజల్లు కురవగానే నిద్రలో ఉన్న మండూకాలన్నీ గుంతల నుంచి బయటికి వచ్చేస్తాయి. ఈ క్రమంలో అవి రుతువులను నిర్లక్ష్యం చేయవద్దని మనుషులకు గుర్తుచేస్తాయి. ఆవులా రంకె వేసేది, మేకలా అరిచేది, ఆకుపచ్చది, మచ్చలదీ అయిన కప్పలు మాకు నిధులను సమృద్ధిగా ఇచ్చుగాక. ఈ ఫలవంతమైన వర్ష రుతువులో కప్పలు మాకు వందలాదిగా ఆవులను ఇచ్చి, మా జీవితాలను సుదీర్ఘం చేయుగాక… అని ప్రార్థిస్తాడు రుగ్వేద రుషి.
వానల్లు కురవాలి వానదేవుడా…
రుగ్వేద కాలంలోనే కాదు ఆధునిక కాలంలోనూ “వానల్లు కురవాలి వానదేవుడా/ వరిచేలు పండాలి వానదేవుడా… కప్పలకు పెండ్లిల్లు వానదేవుడా/ గొప్పగా చెయ్యాలి వానదేవుడా” అని వానదేవుడిని కరుణించమని పాట ద్వారా వేడుకుంటూనే ఉన్నాం. అంతేకాదు వానలు సమయానికి కురవకపోయినా, వానల మధ్య విరామం ఎక్కువగా వచ్చినా కావళ్లలో పెట్టి ఊరేగించి కప్పల పెండ్లిల్లు చేసే ఆచారం ఇప్పటికీ ఉంది. ‘కప్పల కావడి’ అంటే ఇదే. కొన్నిచోట్ల వర్షాలు సమృద్ధిగా కురవడానికి శివుణ్ని జలబంధనం చేయడం, వరద వెల్లువెత్తి చెరువులు నిండి చేలు పండటం కోసం ఊరిజనం అంతాకలిసి ఊరేగింపుగా వెళ్లి ‘వరదపాయసం’ (వరదపాసెం) పోయడం కూడా కనిపిస్తుంది. హిందువుల ఆరాధన బహు దేవతలకు సంబంధించింది. ఒక దేవుడు ఎక్కువ, ఇంకో దేవుడు తక్కువా కాదు. అయితే ఒక దేవుడు ప్రధానంగా ఆరాధన జరుగుతుంటే మిగిలిన దేవతలు అతని అధీనంలో ఉంటారు. ఈ విధమైన ఆరాధనకు ప్రపంచ ప్రసిద్ధ భారతీయ శాస్ర్తాల పండితుడు మ్యాక్స్ ముల్లర్ హెనోథీయిజం, కెథెనోథీయిజం అని పేరుపెట్టాడు. మండూక సూక్తంలో మాత్రం కప్పలే దేవుళ్లు. రుతుధర్మాలను పాటించే కప్పలను తమకు సంపదలు, పశువులు, ధాన్యం సమృద్ధిగా ఇచ్చుగాక అని ప్రస్తుతించారు రుగ్వేద ఆర్యులు.
– చింతలపల్లి హర్షవర్ధన్