రాజన్న సిరిసిల్ల, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సెస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. పుట్టెడు దుఃఖంలోనూ కుటుంబసభ్యులు అతడి అవయవ దానంతో మరో నలుగురికి ప్రాణం పోశారు. వివరాలు ఇలా.. చిక్కాల రామారావు, శోభ దంపతులకు కొడుకు అశ్విన్రావు(40), కూతురు ఉన్నారు.
కూతురు కుటుంబం అమెరికాలో ఉండగా, రామారావు దంపతులు కొడుకు అశ్విన్ కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నారు. అశ్విన్కు భార్య సౌమిత, కూతురు అక్షయ, కొడుకు అయాన్ష్ రామ్ ఉన్నారు. అశ్విన్రావు వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 5న ఆయన ఇంట్లో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే యశోద హాస్పిటల్కు తరలించారు. అక్కడ శనివారం బ్రెయిన్ డెడ్ కాగా, వైద్యులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు.
అవయవదానంపై కౌన్సెలింగ్ చేయడంతో పుట్టెడు దుఃఖంలోనూ కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అశ్విన్రావు అవయవాలను దానం చేసి, ఆదర్శంగా నిలిచారు. తమ కొడుకు చనిపోలేదని, మరో నలుగురిలో చిరకాలం బతికే ఉంటాడని తల్లిదండ్రులు తెలిపారు. అశ్విన్ భౌతిక కాయాన్ని సోమవారం సిరిసిల్లకు తీసుకొచ్చి, అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. అశ్విన్రావు మృతిపై వెలమ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.