తిరుపతి : తిరుమలలో ఈ నెల 13 నుంచి ఐదు రోజులపాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారికి జరిపే ఆర్జిత సేవలను టీటీడీ పాలకమండలి రద్దు చేసింది. అలాగే, తెప్పోత్సవాలకు అంతా సిద్ధం చేశారు. ఓడలో సుఖాశీనుడైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తున్నది. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.
తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధుల్లో ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.
శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుండటంతో టీటీడీ ఒక ప్రకటన జారీ చేసింది. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తిరుమలలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల కారణంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఆర్జిత సేవలైన సహస్ర దీపాలంకార సేవను మార్చి 13, 14వ తేదీల్లో, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను మార్చి 15, 16, 17 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.