శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గత 30 రోజుల్లో రూ.5,02,45,391 ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. శుక్రవారం ఉదయం నుంచి ఆలయ ప్రాకారంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉభయ దేవాలయాల హుండీలతోపాటు పరివార దేవతాలయాల హుండీలను అధికారుల సమక్షంలో శివసేవకులు, సిబ్బంది లెక్కించారు.
వీటితో పాటు 459 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 14 కిలోల 250 గ్రాముల వెండి, 370 యూఎన్ఏ డాలర్లు, 105 కెనడా డాలర్లు, 35 ఖతార్ రియాల్స్, 45 యూఏఈ దిర్హమ్స్, 5 ఎన్ఏయూ రియాల్స్, ఒక కువైట్ దినార్, ఒక జపాన్ యాన్ వీదేశీ కరెన్సీని భక్తులకు కానుకగా సమర్పించారని ఈవో చెప్పారు. కార్యక్రమంలో ఈవోతో పాటు ఈఈ మురళీ బాలకృష్ణ, ఏసీ నటరాజ్, భద్రతా అధికారి నర్సింహరెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్ కుమార్లతో పాటు అధికారులు పాల్గొన్నారు.
భ్రామరికి ప్రత్యేక పూజలు
భ్రమరాంబ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చక పండితులచే పంచామృతాభిషేకాలు పుష్పార్చనలు సర్కారీ సేవగా జరిపించినట్లు ఆయన చెప్పారు. అమ్మవారి ప్రాకార మండపంలో గులాబి నందివర్ధనం, చామంతి బంతి వంటి పూలతొ ప్రత్యేంగా అలంకరించిన ఊయలో స్వామిఅమ్మవార్లను వేంచేబు చేసి అష్టోత్తరశతనామావళి పూజలు చేశారు.