పోతన భాగవతంలో నిత్యనూతనంగా నిగనిగలాడే ఘట్టాలు అనేకం. వానిలో ఆమని కోయిల గానం వంటి ‘వామనావతార’ కథ అనుపమం. శ్రావ్యమైన కావ్యపరంగానే కాక సంభావ్యమైన (నిరంతరం భావింపతగిన) వేదాంతపరంగా కూడా కాంతులీనే ఈ చరిత్రం భవలతాలవిత్రం (సంసారమనే తీగను తెగనరికే కొడవలి), అతి పవిత్రం!
వైరోచని (బలి) వామనుల వార్తాలాపం- సంభాషణ, చాలా సరసంగా సాగింది. రససిద్ధుడు పోతన భాగవతంలో పరమార్థ తత్తాన్ని ప్రతిపాదించే పలు రసవత్తరమైన పద్యాలను స్వతంత్రంగా, సందర్భోచితంగా వెలయించాడు, ‘వామన చరిత్ర’లోని ఈ సీసం పస కలిగిన అట్టి రసరమ్యమైన పద్యాలలో ఒకటి. ఈ పద్యం ప్రస్తుత ఘట్టానికి శీర్ష-ముఖ స్థానీయంగా పేర్కొన తగ్గది. వామనుని అర్చించి బలి అతనిని ముచ్చటగా మూడు ప్రశ్నలు అడిగాడు. పేరు, ఊరు, అయినవారు- తల్లిదండ్రులు ఎవరో చెప్పమన్నాడు. వామనుడు ఇలా పలికాడు…
సీ॥ ‘ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు?
నొకచోటనక యెందునుండ నేర్తు;
నెవ్వనివాడ నం చేమని పలుకుదు?
నాయంతవాఁడనై నడవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ
బూని ముప్పోకల బోవ నేర్తు
నదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ?
నేరుపులన్నియు నేన నేర్తు
ఆ॥ నొరులు గారు నాకు నొరులకు నేనౌదు
నొంటివాఁడ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁదొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దరచు జొచ్చియుందు?
రాక్షస రాజా! నేను నివసించే చోటు ఏదని అడిగావు, బాగుంది. కాని, నా చోటు ఇదే అని ఇదమిత్థంగా- నిశ్చితంగా ఎలా చాటి చెప్పేది? అడుక్కుతినే వాడికి అరవై ఆరు ఊళ్లని అంటారుగా! అన్ని ఊళ్లూ నావే. ఒక చోటనక అన్ని చోట్లా ఉంటాను. పాలలో వెన్నవలె, నువ్వులలో నూనె వలె, చెకుమొకి రాళ్లలో చిచ్చువలె ప్రపంచంలో వెన్నుడు (విష్ణువు) అంతటా నిండి ఉన్నాడు. అసలు ‘విష్ణు’ శబ్దానికి ‘వేవేష్టి వ్యాప్నోతి’- సర్వత్ర వ్యాపించి ఉన్నవాడనే అర్థం.
(‘ఇందుగలఁడందు లేఁడని
సందేహము వలదు; చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.’– అని ఎంతో ఓర్పుతో నేర్పుగా నీ తాత ప్రహ్లాదుడు ఇచ్చిన శాశ్వతమైన తీర్పు తెలుసుకో). ఎవరికి చెందిన వాడనని చెప్పను? నాకు జననీజనకులు ఉంటే గదా! నేను ‘స్వయంభువు’ని. ఈ జగత్తుకు తల్లి, తండ్రి, తాత, ముత్తాత అంతా నేనే! సర్వప్రాణులకు పరమాత్మ తండ్రి, ఆయన శక్తి అయిన ప్రకృతి తల్లి. నా అంతవాడనై స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటానని మాత్రం అనగలను. సహస్ర నామాలలో విష్ణువుకు ‘ఆత్మవాన్’ అని ఒక నామం. ‘స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వేమహిమ్ని’ అని ఛాందోగ్య ఉపనిషత్తు- ఆ భగవంతుడు తన ‘మహిమాతిశయం’లోనే ప్రతిష్ఠితుడై, తనకు తానే ఆధారమై, అచ్యుతుడై నిలిచి ఉన్నాడు.
ఇక, నా నడవడి అంటావా, ఇది అది అని తుది తీర్పుగా ఏదని చెప్పేది? పూనికతో, ఇచ్ఛాపూర్వకంగా ముప్పోకలు- మూడు పోకడలూ పోగల వాడను. ఇక్కడ ముప్పోకలు అనగా సామాన్యంగా సృష్టి, స్థితి, లయాలు; మూడు లోకాలు; ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే త్రిశక్తులు. కాని, విశేషంగా జాగ్రత్, స్వప్న, సుషుప్తులు అన్న అవస్థాత్రయం. పోతే, నా చదువు, సంధ్య ఏమంటావా? ఇది నేర్చాను, అది నేర్చాను అని పదేపదే చెప్పడమెందుకు? అన్ని విద్యలలో ఆరితేరిన వాడను. విద్యలకు, కళలకు అన్నిటికి ఆదిగురువు వేదస్వరూపుడు భగవంతుడే కదా! నాదంటూ ఒక పేరు, ‘నా’ అని చెప్పుకొనేవారు ఎవరూ లేకపోయినా, నేను మాత్రం అందరికీ చెందిన వాడను.
ఏ పేరుతో పిలిచినా పలుకుతా! ‘అనంత నామధేయాయ, సహస్ర నామ్నే, సర్వాకార విధాయినే’- స్వామికి అనంతనామాలు, అన్ని రూపాలు ఆయనవే! నన్ను చేరదీసే వారెవరూ లేరు. నేను మాత్రం, ‘నేను నీవాడను’ అని నా దరి చేరిన వారందరినీ ఆదరించి అక్కున చేర్చుకుంటా. ఒకప్పుడు నా సహచరి సిరి- శ్రీమహాలక్ష్మి నా దరిలోనే ఉండేది. కాని, ఇప్పుడు ఒంటరిని- బ్రహ్మచారిని. చుట్టాలు, పక్కాలు ఎవరూ లేరు. బలీ! నా ఉనికి- నివాసం ఎక్కడ అని అడిగావు కదా! విను, తరచుగా మంచివారితో కలసి మసలుతూ- మెలుగుతూ ఉంటా. ‘నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేషు చ, మద్భక్తా యత్రగాయన్తి తత్ర తిష్ఠామి నారద’- నేను వైకుంఠంలో కాని, యోగుల హృదయాలలో కాని ఉండను. నాకు ఇష్టులైన నా ఏకాంత (అనన్య) భక్తులు నన్ను నిష్ఠతో కీర్తించే చోట నేను తిష్ఠవేసుకొని కూర్చుంటాను- అని నారాయణుడు నారద మహర్షితో అన్నమాట!
తాను దర్శించిన సత్యాన్ని చతురతతో వర్ణించి చెప్పగలవాడు కవి. దేశ, కాలాల హద్దులను చెరిపేసి చూడగలవాడు. అట్టివాడే రుషి కూడా. ఈ సృష్టిలో తొలికవి పరమాత్మ. జీవన్ముక్తుడైన మనీషి- మహాపురుషుడే మలికవి. రుషి వంటి పోతన పరమాత్మ ద్వారా ‘పూనిముప్పోకలఁ బోవ నేర్తు’ అని పలికించి, నిజ జీవితంలో తన ‘పోకడ’ ఏమిటో చెప్పకనే చెప్పి ‘నానృషిః కురుతే కావ్యం’- రుషి కానివాడు కావ్యం రచింపలేడు అని నిరూపించాడు!
బలి అనగా బలం కలిగినవాడు. ఏమిటా బలం? దేహాత్మ- ‘దేహమే నేను’ అన్న వాసనాబలం. అది ఉన్నవాడే జీవుడు. దేవుడు- లీలా వామనుడు అట్టి జీవుణ్ని- బలిని మూడు అడుగుల నేల అర్థించాడు. ఏమిటా మూడడుగులు? జీవత్వానికి కారణమైన స్థూల, సూక్ష్మ, కారణ దేహాలకు ప్రతీకలు- సంకేతాలు. ఈ మూడు దేహాల అవస్థలే- దశలే జాగ్రత్, స్వప్న, సుషుప్తులు- సత్త రజః తమో గుణాల పరిణామాలు. ‘పురత్రయే క్రీడతి యశ్చజీవః’ (కైవల్యోపనిషత్తు)- జీవుడు విశ్వ, తైజస, ప్రాజ్ఞులనే మూడు దేహాలు ధరించి, క్రమంగా జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలలో క్రీడిస్తూ ఉంటాడు- ‘విశ్వరూపా జాగరణీ స్వపంతీ తైజసాత్మికా సుప్తా ప్రాజ్ఞాత్మికా’- (లలితా సహస్రనామాలు). వీని నుంచే విచిత్రమైన ఈ విశాల ప్రపంచం పుడుతోంది. ఇవే ముప్పోకలు- మూడు విధాల రాకపోకల పోకడలు. అవిద్యా (కారణ శరీరం), కామ (సూక్ష్మ శరీరం), కర్మ (స్థూల శరీరం)లు- అని కూడా అన్నారు వేదాంతులు. జీవత్వ భ్రాంతికి, సంసార బంధానికి ఇవే మూల కారణాలు.
నిజానికి జీవుడు ఈ మూడు ఉపాధులలో (దేహాలలో) ఏదీ కాదు- స్వప్నంలో జాగ్రత్తు లేదు, జాగ్రత్తులో స్వప్నం లేదు. ఈ రెండూ సుషుప్తి (గాఢనిద్ర)లో లేవు. సుషుప్తి కూడా ఆ రెండిటియందు లేదు. ఈ మూడూ త్రిగుణాలచే కల్పించబడినాయి కాన మిథ్యయే! మరి సత్యమెవరు? ఈ మూడింటికీ సాక్షి అయిన ద్రష్ట (ఆత్మ) గుణాతీతుడు, నిత్యమైన చిదాత్మ. అదే సత్యం! ఈ వాస్తవాన్ని గ్రహించి దేహత్రయం మీది అభిమానం వీడనంత వరకు జీవుడు విడుదలకు- ముక్తికి నోచుకోలేడు. ఈ అవస్థా త్రయాన్ని అత్రికమించడమే అపవర్గం- మోక్షం. వామనుడు రెండు అడుగులలో బలి స్థూల, సూక్ష్మ శరీర భ్రాంతిని, అతని తలమీద తృతీయ పాదం పెట్టి అతని కారణ శరీర భ్రాంతిని- అభిమానాన్ని బలిగొని సర్వం భగవన్మయం చేశాడు. ‘సకల మిదమహం చ వాసుదేవః’- నాతో సహా సర్వం వాసుదేవుడే అనే సర్వాత్మ భావం కలిగించాడు.
ఆత్మ అవస్థాత్రయం- మూడు పాదాలకు అతీతం- సాక్షి కాన చతుర్థ పాదం- ‘సోయమాత్మా చతుష్పాత్’ (మాండూక్యోపనిషత్తు). కుండను ప్రకాశింప చేసే సూర్యుడు కుండ నశించినా తాను నశింపనట్లు, మూడు దేహాలను, దశలను ప్రకాశింప చేసే సాక్షి అయిన ఆత్మ, దేహాలు నశించినా తాను నశింపదు. ఆ ఆత్మే మన స్వరూపం. తెలియవలసింది ఇదొక్కటే! ఎలాంటి సంకల్ప వికల్పాలు లేవు కాన ఈ చతురీయ (నాల్గవ) దశ (సర్వావస్థా వివర్జితా) జాగ్రత్ కాదు, స్వప్నం కాదు. జడస్థితి (తమస్సు) కాదు కనుక సుషుప్తి దశ కూడా కాదు. ప్రకృతి తన స్వరూపంలో విలీనమై ఉండు స్థితియే తురీయం. ఇదే జాగ్రత్ సుషుప్తి- జాగ్రద్దశలోనే సుషుప్తుని వలె ఉంటూ కర్మలు చేయుట. ‘తురీయావస్థా నమస్కారః’- ఈ తురీయ స్థితియే నారాయణునికి నిజమైన నమస్కారం! దేహం లేనట్లు భావించుటే భగవంతునికి ‘బలి హరణం’! (భావనోపనిత్తు). ఈ స్వరూపంలో ఉండుటే స్వస్థత- సమాధి! దీనికి విరుద్ధంగా ప్రకృతి- ప్రపంచంలో పడి ఉండటమే అస్వస్థత- వ్యాధి! అది స్వరూపం కాదు. విరూపం- వికృత రూపం!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006