శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు గురువారం చండీశ్వరుడికి షోడషోపచార పూలు నిర్వహించారు. ఆ తర్వాత ఈవో లవన్న ఆధ్వర్యంలో రుద్ర హోమం, పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పుష్కరిణిలో వైదిక శాస్ర్తోక్త అవబృదస్నానం చేయించి, ఆ తర్వాత వసంతోత్సవాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి కల్యాణోత్సవం అనంతరం స్వామిఅమ్మవార్లకు సాంప్రదాయం ప్రకారం పార్వతీదేవి అమ్మవారికి మెట్టెలు, నల్లపూసలు సమర్పించే నాగవల్లి కార్యక్రమాన్ని జరిపారు.
అదే విధంగా నిత్యకల్యాణ మండపంలో అర్చక వేదపండితులు చతుర్వేద పారాయణతో సదస్యం వేదస్వస్థి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల తొలి రోజున బ్రహ్మోత్సవాలకు దేవతాలకు ఆహ్వానం పలుకుతూ ఆవిష్కరించిన ధ్వజపటం అవరోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా.. శుక్రవారంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల అశ్వవాహన సేవ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు పుష్పోత్సవం, శయనోత్సవ, ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు లవన్న వివరించారు.