శ్రీశైలం : ముక్కోటి ఏకాదశి వేడుకలు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి క్షేత్రంలో వైభవంగా జరిగాయి. ఈవో లవన్న ఆధ్వర్యంలో గురువారం తెల్లవారు జామున మేళతాళాల మధ్య ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, మంగళహారతులు ఇచ్చారు. స్వామి అమ్మవార్లను ముఖమండపంలో ఆసీనులను చేసి, ఉత్సవ సంకల్పాన్ని.. అనంతరం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించారు.
అనంతరం ఉత్తర ద్వారం నుంచి స్వామిఅమ్మవార్లను వెలుపలకు తీసుకువచ్చి బలిపీఠం వద్ద ఉత్తరముఖంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, రావణవాహన సేవను వైభవంగా జరిపించారు. మేళతాళాలతో ఆలయ మాఢవీధుల్లో ఆదిదంపతుల ప్రాకారోత్సవం జరిపించి, భక్తులకు ఉత్తర ద్వారం నుంచి సర్వదర్శనాలు కల్పించినట్లు ఈవో లవన్న తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున కృష్ణానదిలో స్నానాలు చేసి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయంలో బారులు తీరారు.
పురపాకం..పురిపాకం..
వైకుంఠ ఏకాదశి సందర్బంగా దేవస్థానం పరిధిలోని యోగిని మాత ఆధ్యాత్మిక సేవా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్వదినాన నిష్టతో పూజాధికాలు చేసి, భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల సంసార జీవనంలో గ్రహదోషాలు వీడి సుఖమయ జీవితం ప్రాప్తిస్తుందని యోగిని మాత అన్నారు. పండుగ రోజున ప్రత్యేకంగా ‘పురపాకం.. పురిపాకం’ అని పిలిచే పాయసం, పులిహోర అన్న ప్రసాదాలను భక్తులు తప్పక స్వీకరించాలన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన నిర్వహించారు.