శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! సర్వజగత్తుకూ జననీజనకులు, ఆదిదంపతులు శ్రీ లక్ష్మీనారాయణుల దివ్య అనురాగ భరిత దాంపత్య ధర్మం కనుమరుగు కాకుండా ఇలలో కలకాలం వర్ధిల్లాలని… ప్రకృతి పురుషుల పెల్లుబికిన ప్రేమధారను జగదాధారంగా, సుధారస పూరంగా, సదా ముదావహంగా, సరసంగా వర్ణించాడు రససిద్ధుడు పోతన…
కం॥‘హరి సూచిన సిరి సూడదు
సిరి సూచిన హరియుఁ జూడ సిగ్గును బొందున్
హరియును సిరియును దమలో
సరి చూపులఁ జూడ మరుఁడు సందడి వెట్టెన్..’
వలపుతో విష్ణువు చూస్తే వైష్ణవి సిగ్గుతో తల ఎత్తేది కాదు. మాధవి చూస్తే ఆమెను చూడటానికి మాధవుడు సిగ్గుపడేవాడు. హరి, సిరి (లక్ష్మి) పరస్పరం సరిసమానంగా చూచేటట్లు సుమశరుడు- మన్మథుడు వడిగా సందడి చేశాడు.
చ॥‘జగముల దండ్రియై తనరు శౌరి జగంబుల తల్లి నిందిరం
దగ నురమందుఁ దాల్చె, నటఁ దత్కరుణారస దృష్టిచేఁ బ్రజల్
మగుడగఁ దొంటి భంగి నతిమంగళ సాధ్వి పతిత్వ సంపదన్
నెగడిన లోకముల్ గని రనేక శుభంబులఁ బొంది రత్తరిన్’
జగజ్జనకుడు జనార్దనుడు, జగజ్జనని లక్ష్మీదేవిని తన వక్షాన చేర్చుకున్నాడు. అప్పుడు కృపావృష్టి (వర్షం) కురిపించే కమలాప్రియ అపాంగ వీక్షణల వల్ల ప్రజలు అనేక శుభాలు పొందారు. అట్టి పురంధ్రీ (నారీ)మణి పూర్వంవలె ప్రాణ దయితుని- భర్తను పొందిన పుణ్యసంపద వల్ల ఎల్లలోకాలు ఉల్లసించి పెంపొందినాయి’. లక్ష్మీదేవి శుభకరమైన చూపులు కరవై రాక్షసులు పరితపించారు. వారికి కీడుగా తోచింది.
శుకుడు- ధీరవ్రతా! శ్రీరంగధామేశ్వరి తరువాత క్షీరవారిధి నుంచి ‘వారుణి’ (మదిర) అనే వారిజాక్షి- సుందరి వెలికి వచ్చింది. నీరజాక్షుని (విష్ణువు) అనుమతితో ఆ మదిరాక్షిని రాక్షసులు స్వీకరించారు. ఇంకా చిలకగా చిలకగా అమృత కలశాన్ని చేతపట్టుకొని ఆయుర్వేద విద్యలో ఆరితేరినవాడు, అమరవైద్యుడు, అచ్యుత అంశాంశ సంభవుడు అయిన దివ్యపురుషుడు ‘ధన్వంతరి’ ఆవిర్భవించాడు. ధన త్రయోదశి (ఆశ్వయుజ బహుళ త్రయోదశి) నాడు జన్మించాడు కావున ‘ధన్వంతరి’ అని నామం. ఎదురులేని బలంతో చెలరేగి ఎగబడి అసురులు అమరులను త్రోసిపుచ్చి, బెదిరించి ధన్వంతరి చేతిలోని అమృత కలశాన్ని అపహరించారు. ‘చావులేని మందు మనకు చక్కగ ముందుగా, సులువుగా చిక్కింది’ అంటూ జంభంతో దైత్యులు ఆ అమృత కుంభాన్ని పట్టుకుపోయారు. దేవతలు భయపడి ‘అమృతభాండం మాకు దక్కకుండా పోయింది, కావుమంటూ గావుకేకలు వేస్తూ హరితో మొరపెట్టుకున్నారు. కరుణామయుడు విష్ణువు శరణాగతులైన గీర్వాణులకు (వేల్పులకు) ‘నా మాయను ప్రయోగించి మీ కోరికను నెరవేరుస్తా, భయపడకండి’ అంటూ అభయమిచ్చాడు.
రాజా! అమృత కలశం చేజిక్కించుకొన్న అసురులలో అంతర్యామి- స్వామి సంకల్పంతో అమంగళకరమైన ‘అహంపూర్వమహం పూర్వం’ (నేను ముందంటే నేను ముందు) అను అంతఃకలహం పుట్టుకొచ్చింది. పెద్ద చేతుల వానిదే పెత్తనమయింది. బలహీనుడి చేతిలోని కలశాన్ని బలవంతుడు లాక్కొనగా.. మరో బలాధికుడు వాని నుంచి గుంజుకొని పరిగెత్తాడు. దుర్బలులు లబోదిబో అన్నారు. విషయాకర్షణ ఉన్నచోట ఘర్షణ, తర్షణ (దాహం)లు కాక హర్షణ తర్పణలు (ఆనందం, తృప్తి) ఉంటాయా? రాజా! అట్టి తరి, విరించాది (బ్రహ్మ మొదలైన) దేవతలను పరిరక్షించడానికి మురారి అసుర వీరుల మధ్య ‘మోహినీ’ రూపంలో అకస్మాత్తుగా అవతరించాడు. సర్వజగత్తునీ మోహ పరవశం చేసే అపురూప మాయా విలాస విభ్రమ మయం ఈ ‘జగన్మోహినీ’ రూపం. మరి, ఈ నారీరూప పురుషావతారానికి పరమార్థం… బలవంతులైన రాక్షసులకు బలమైన రెండు బలహీనతలు- కామిని, వారుణి (మద్యం)! మోహిని సౌందర్యం అసదృశం, అద్భుతం. అయినా ఆ మాయిక సౌందర్యం తామసికమేకాని సాత్తికం కాదు. అది మాదకమే కాని మోదకం కాదు. బాధకము, బంధకమే కాని మోచకం- ముక్తిప్రదం కాదు. అది అసురులను మాయజేసి, మరులుగొల్పి మభ్యపెట్టడానికే! మాయామోహినిని వీక్షించినా దేవతలు నిర్వికారులు! కాని, ఈ సుదతి దర్శనంతో దితిసుతులకు మతి భ్రమించింది. ‘ఓ నీరజాక్షీ! నీ నామమేమి? నీకేమి కావాలి? ఓ కాంతా లలామా! మేము కశ్యప ప్రజాపతి పుత్రులం. దేవతలకు భ్రాతలం- సోదరులం. అవక్ర పరాక్రమ సంపన్నులం. అన్నదమ్ములమైన మేము జ్ఞాతివైరంతో అమృత పానానికి పోటీ పడుతున్నాం. పంపకాలు కుదరడం లేదు. ఓ మానవతీ! ఈ అమృతాన్ని నీవు మాకు సరి సమానంగా పంచిపెట్టు’ అని అసురులు పెచ్చరిల్లిన మోహంతో హెచ్చరికగా అడిగారు. మాయా మోహిని రూపంలో ఉన్న మాధవుడు తన వాలు చూపుల తూపుల (బాణాల)తో వారి ధైర్యాన్ని రూపుమాపుతూ.. ఓ బృందారక రిపులారా! అందమైన మగవారి పొందును ఆశించే వేశ్యయందు పెద్దలైన మీరందరికీ ఇంతగా నమ్మకం ఎలా కలిగిందో! అంతేగాక…
కం॥‘పలుకులు మధురస ధారలు
దలఁపులు నానా ప్రకార దావానలముల్
సెలుములు సాలావృకములు
సెలువల నమ్ముటలు వేద సిద్ధాంతములే?’
‘కామినుల మాటలు తేనెల సొనలు. వారి మనోభావాలు పలువిధాలైన వనాగ్నులు- కార్చిచ్చులు. ఇక, వారితో కూరిమి- ప్రేమ, అంటే తోడేళ్లతో చెలిమే! అటువంటి వనితలను విశ్వసించడాలు వేద సిద్ధాంతాలు- శాస్త్ర సమ్మతాలు కావు కదా? అయినా, నన్ను నమ్మారు కాన, చేతనైనట్లుగా, శక్తివంచన లేకుండా, యుక్తితో పంచిపెడతాను. ఇంచుక కూడా సందేహించకండి. కానివ్వండి మరి!’ అలా పలుకగానే ఆ మాటల వలలో పడ్డ రాక్షసులు కలశాన్ని ఆ హేలావతి చేతికి అందించారు.
శుక ఉవాచ- రాజా! లీలాసుందరిగా మారిన గుణమందిరుడైన ముకుందుడు ‘మంచీచెడూ ఎంచకుండా నేను పంచిపెట్టే తీరును మీరు మారు పలుకక అంగీకరించాలి’ అనగానే అసురులు లోభం కొద్దీ ‘సరే’ అన్నారు. మోహిని ఓరచూపుల కవ్వింపులు, ఇంపుసొంపుల బుజ్జగింపులు, చల్లని కల్లల లాలింపులు- అన్నీ రాశుల రాశుల ఆశాపాశాలై- త్రాళ్లవలె అసురుల నోళ్లను మూసివేశాయి. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006