రామచంద్రుడి కోవెల లేని ఊరు కనిపించదు. ఒక ఆలయానికి క్షేత్ర ప్రాధాన్యం ఉంటుంది. మరో గుడికి తీర్థ విశేషం కనిపిస్తుంది. నిర్మాణ వైచిత్రి ఉన్న గుళ్లు కొన్ని ఉంటాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగంపేట సీతారామచంద్రస్వామి ఆలయం ఉత్తర ద్వారం కలిగి ఉండటం ప్రత్యేకం! ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం గురించి తెలిసిందే! మంగంపేట ఆలయంలో నిత్యం ఉత్తర ద్వార దర్శన పుణ్యం ప్రాప్తిస్తుంది.
ఈ ఆలయానికి సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర ఉందని శాసనాల ద్వారా తెలుస్తున్నది. గతంలో శ్రీరామనవమి సందర్భంగా పది రోజుల పాటు ఉత్సవాలు జరిగేవి. ప్రస్తుతం ఆరు రోజులపాటు వేడుకలు నిర్వహిస్తున్నారు. రామనవమి ఉత్సవాల్లో భాగంగా అశ్వసేవ, హనుమత్ సేవ, గరుడ సేవ, రథోత్సవం తదితర సేవలు అంగరంగ వైభవంగా సాగుతాయి. సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తారు. కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. మంగంపేట రామచంద్రుడికి భవ్యమందిరాన్ని నిర్మించే యోచనలో గ్రామస్తులు ఉన్నారు.
…? ఎం.రమేశ్, జిన్నారం