అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే॥ (ధ్యాన యోగము-35)
‘మనసు నిస్సందేహంగా చంచలమైనదే! నిగ్రహించడానికి కష్టసాధ్యమే అయినా అభ్యాస వైరాగ్యాలతో దాన్ని సులభంగా నిగ్రహించవచ్చు’ అని అర్జునుడికి ఉపదేశించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. మనోనిగ్రహాన్ని సాధించడానికి సులభమైన మార్గం భక్తిపథంలో నడవడమే. అది అలవడితే సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలూ కలుగుతాయి. సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొనేలా చేస్తుంది.
ఆధ్యాత్మిక సాధనకు, లౌకిక విషయాల సాధనకూ మనో నిగ్రహం అవసరం. చంచలమైన మనసును విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మకు అధీనమై ఉండేలా చేసుకోవాలి. మనసును జయించిన వాడు ముల్లోకాలనూ జయించినట్లే! మనో నిగ్రహం సాధించడం అసాధ్యం కాదు. మితంగా మాట్లాడటం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించడం, ఉపవాస దీక్ష, సాత్వికాహారం తీసుకోడం, భగవన్నామ స్మరణం, ప్రాణాయామం వల్ల మనో నిగ్రహాన్ని సాధించవచ్చు. నిరంతరం భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటే చాలు మనో నిగ్రహం అలవడుతుంది. అప్పుడు నేను, నాది అనే మమకారాలు వీడిపోతాయి. స్వార్థం నశిస్తుంది. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. మనోనిగ్రహాన్ని సాధించిన వాళ్లే మహాత్ములుగా నిలుస్తారు. చిరస్మరణీయులు అవుతారు.