శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో కృష్ణవేణి నదీ హారతి కార్యక్రమం కనుల పండువలా జరిగింది. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ కృష్ణవేణి నదితల్లికి గంగాహారతి ఇచ్చారు. అంతకు ముందు చీరెసారెలు, పసుపుకుంకుమలు వాయనంగా సమర్పించినట్లు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం అర్చక వేదపండితులతో కలిసి పాతాళగంగ వద్ద నెలకొల్పిన కృష్ణమ్మతల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయానుసారంగా 11 మంది అర్చకులతో 11 రకాలయిన ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, పుష్పహారతి, నందిహారతి, సింహహారతి, నక్షత్రహారతి, విష్ణుహారతి, కుంభహారతి ఇచ్చారు.
వైభవంగా పుష్కరిణి దశవిధ హారతులు
శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. అర్చక, వేదపండితులచే ఉభయ దేవాలయాల్లో నిత్యకైంకర్యాలతోపాటు పరివార దేవతలకు షోడషోపచార పూజలు చేశారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లను పల్లకీలో వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణచేసి, ఆ తర్వాత పుష్కరిణి వద్ద ప్రతిష్టించి సంకల్ప పూజాధికాలు నిర్వహించారు. అనంతరం లక్ష దీపార్చనలో భాగంగా భక్తులచే దీపాలు వెలిగింపజేశారు.
అనంతరం పుష్కరిణికి ఇస్తున్న దశవిధ హారతుల దర్శన భాగ్యాన్ని తెలుపుతూ ప్రవచనపూర్వక కార్యక్రమాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తిలకించి ఆది దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. పుష్కరిణి వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్నతోపాటు ప్రధాన అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ, ముఖ్యార్చకులు హరిస్వామి, ఈఈ మురళీబాలకృష్ణ, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్కుమార్, పీఆర్వో శ్రీనివాసరావు, పర్యవేక్షకులు శ్రీహరి, ఆలయ ముఖ్య భద్రతా అధికారి నర్సింహారెడ్డి, అయ్యన్న, రవికుమార్ పాల్గొన్నారు.