ఒక పండితుడు సముద్ర తీరాన కూర్చుని సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ, అలల్ని చూస్తున్నాడు. అక్కడికి సమీపంలో ఓ విద్యావంతుడైన యువకుడు నిరాశగా కూర్చున్నాడు. అతణ్ని నిరాశకు కారణం ఏంటని అడిగాడు పండితుడు. అప్పుడు ఆ యువకుడు ‘నేను చేస్తున్నది చిన్న ఉద్యోగం, తక్కువ జీతానికి పని చేస్తున్నానని నా మిత్రులు వెక్కిరిస్తున్నారు’ అని వాపోయాడు. పండితుడు చిన్నగా నవ్వి పక్కనే ఉన్న మొక్క నుంచి కొన్ని పూలు కోయమని యువకుడికి చెప్పాడు. వాటిని సముద్రంలోకి విసిరేయమన్నాడు. ఆయన చెప్పినట్లే చేశాడు యువకుడు. అలల ఉద్ధృతికి పూలు వెనక్కి వచ్చాయి. సమీపంలోని ఓ పెద్ద చెట్టు ఆకులను కోసి సముద్రంలోకి విసిరేయమని మళ్లీ చెప్పాడు. అలాగే చేశాడు యువకుడు. అవికూడా కొద్దిసేపటికి వెనక్కి వచ్చేశాయి.
‘గమనించావా సముద్రంలోకి నువ్వు పూలు విసిరినా, ఆకులు విసిరినా రెండూ వెనక్కి వచ్చేశాయి. పూలు గొప్పవనీ, ఆకులు చెడ్డవని సముద్రం పట్టించుకోదు. అలలతో కూడిన సముద్రం తన ఉనికిని కోల్పోకుండా అలాగే ఉంటుంది. నువ్వుకూడా ఇతరుల అభిప్రాయాలకు వెరవకు. గత అనుభవాల ఆధారంగా, నీ భవిష్యత్తును ఊహించి సలహాలు ఇస్తుంటారు. వాటిని నువ్వు పట్టించుకోవాల్సిన పనిలేదు. ధర్మ సమ్మతంగా కష్టపడటమే మనం చేయాల్సింది. కష్టే ఫలి అన్నారు కదా!’ అని సలహా ఇచ్చాడు పండితుడు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగిస్తూ… కష్టపడితే పెద్ద ఉద్యోగం సంపాదించవచ్చని యువకుడికి నమ్మకం కలిగింది. పండితుడికి ధన్యవాదాలు తెలిపి అక్కణ్నుంచి ఉత్సాహంగా ముందుకు కదిలాడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821