తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో రేపటి నుంచి టోకెన్లు లేకుండానే శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. దీంతో వైకుంఠం-2 వెలుపల క్యూలైన్లలో బారులు తీరుస్తున్నారు. ప్రస్తుతం దర్శనం టికెట్లు ఉన్న వారిని క్యూలైన్లలోకి టీటీడీ సిబ్బంది అనుమతి ఇస్తున్నారు. రేపటి నుంచి టికెట్లు లేకుండా వచ్చిన భక్తులకు నేరుగా దర్శనం కల్పించనున్నారు.
అలిపిరి నడకమార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల తర్వాత ఇవాళ సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం పోటీపడ్డారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకున్నది. ఈ క్రమంలో పలువురు భక్తులు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము తిరుపతికి చేరుకొని మూడు నాలుగు రోజులవుతుందని, టోకెన్లు జారీ చేయడం లేదని వాపోతున్నారు. భోజనం, మంచినీళ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్ల ఇవ్వకపోయినా.. కనీసం కొండపైకి కూడా అనుమతించడం లేదని, కనీసం కొండపైకి అనుమతిస్తే తలనీలాల మొక్కులు చెల్లించుకుంటామని వాపోయారు. మరో వైపు భారీగా భక్తులు తరలివస్తున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. ఐదు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్ల తెలిపింది. భక్తులు దేవస్థానంతో సహకరించాలని విజ్ఞప్తి చేసింది.