శ్రీశైలం : తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. గురువారం క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. గురువారం నుంచి నెలాఖరు వరకు భక్తులందరికీ ఉచిత స్పర్శ దర్శనాలు కల్పిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా రద్దీ దృష్ట్యా గర్భాలయ అభిషేకాలు, ఆర్జిత సేవలను పూర్తి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సామూహిక అభిషేకాల్లో పాల్గొనే సేవాకర్తలకు వృద్ధ మల్లికార్జున స్వామివద్ద అభిషేకాలు చేయించి, స్పర్శ దర్శనం కల్పించేందుకే ఏర్పాట్లు చెప్పారు.
క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, మంచినీరు, పాలు, మజ్జిగ నిరంతరంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. స్వామిఅమ్మవార్ల దర్శనార్థం వచ్చే యాత్రికులు దేవస్థానం అధికారులు, సిబ్బందితో సహకరించాలని కోరారు. అయితే, ప్రధానంగా కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు దేవస్థానం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.