శ్రీశైలం : శివన్నామస్మరణతో శ్రీశైల క్షేత్రం మార్మోగింది. కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. వేకువ జామున నుంచే కృష్ణా నదిలో స్నానాలు చేసి, నదీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకొని, దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల తాడికిని దృష్టిలో పెట్టుకొని తెల్లవారు జామున 3 గంటలకే ఆలయ ద్వారా తెరిచి, స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాల అనంతరం 5 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించినట్లు ఈవో లవన్న తెలిపారు.
స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపివేయగా.. అలంకార దర్శానికి అతిశీఘ్ర, శీఘ్ర, ఉచిత దర్శన క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు గంట సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. క్యూన్లలో ఉన్న భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం అందించినట్లు చెప్పారు. అలాగే సాయంత్రం వరకు అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు గంగాధర మండపం, ఉత్తరమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. దీపదానాలు, సాలెగ్రామ దీపదానాలు, కార్తీక సంకల్ప పూజల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని అధికారులు భక్తులకు సూచించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆలయ దక్షిణ మాడవీధిలో నిర్వహించిన కళారాధన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన వస్తుందని ఆలయ పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన రేణుక బృందం, ధవళేశ్వరానికి చెందిన సిద్దేంధ్ర కూచిపూడి నృత్య కళాక్షేత్రం నృత్య ప్రదర్శనలు, భక్తి విభావరి భక్తులను అలరించాయి.
రేపు లక్ష దీపోత్సవం
కార్తీక మాసం రెండో సోమవారం సందర్బంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, దశవిధహారతులు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. దశవిధ హారతులను దర్శించుకోవడంతో సకల శుభాలు కలుగుతాయని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద తెలిపారు.
కల్యాణకట్టను తనిఖీ చేసిన ఈవో
శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికుల ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని ఈవో లవన్న భక్తులకు సూచించారు. ఆదివారం కల్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, భక్తులతో మాట్లాడారు. క్షేత్ర పరిధిలో దేవస్థానం నిర్వహించే ఆర్జిత సేవా విభాగాల్లో టికెట్ ధరకంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కల్యాణకట్టలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చి తలనీలాలు తీయించుకునే వారి నుంచి కానుకల రూపంలో వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందిస్తే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మెదలాలని సిబ్బందికి సూచించారు.